Begin typing your search above and press return to search.

ఇదే సాక్ష్యం: జగన్, షర్మిల విడిపోయినట్టే?

By:  Tupaki Desk   |   8 July 2021 7:30 AM GMT
ఇదే సాక్ష్యం: జగన్, షర్మిల విడిపోయినట్టే?
X
అందరూ అనుమానించిందే నిజమైంది? మీడియా ఊహాగానాలకు బలం చేకూరింది. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ తండ్రికి ఒకేసారి నివాళులర్పించలేదు. కూతురు ఈ ఉదయం నివాళులర్పించింది.. కొడుకు ఈ సాయంత్రం అర్పించబోతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు వైఎస్ఆర్ జయంతి సాక్షిగా బయటపడ్డాయని గుసగుసలు వినిపిస్తున్నాయి..

ఈ ఉదయం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వైఎస్ షర్మిల వచ్చారు. ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించారు. పక్కన అన్నయ్య వైఎస్ జగన్ కానీ.. వదిన భారతి కానీ లేకపోవడం గమనార్హం.

ఇక వైఎస్ జగన్ పర్యటన కూడా ఖరారైంది. షర్మిల ఇడుపులపాయ నుంచి వెళ్లిపోయాక సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ ఇదే ఇడుపులపాయకు వస్తున్నారు. తండ్రికి నివాళులర్పిస్తున్నారు. నిజానికి గత సంవత్సరం వీరిద్దరూ కలిసి తండ్రికి నివాళులర్పించారు. కానీ ఈ సంవత్సరం అది జరగలేదు.

ఎందుకంటే వైఎస్ జగన్ వద్దంటున్నా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడానికి రెడీ అయ్యింది. జగన్ ను కాదని వినకుండా తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టింది. అందుకే ఇష్టం లేని పనిచేస్తున్న షర్మిలపై జగన్ కోపంగా ఉన్నాడని.. అందుకే ఆమెను దూరం పెట్టారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమని తేలిందని అంటున్నారు.

ఇక దీనికి సాక్ష్యం మిచ్చేలా తాజాగా తెలంగాణలో కొత్త పార్టీని ఈరోజు పెట్టబోతున్న వైఎస్ షర్మిల.. జగన్ కు బద్ద శత్రువైన ఆ టీడీపీ అనుకూల పత్రికకు ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అదే జగన్ సారథ్యంలోని సాక్షికి ఆ ఫుల్ పేజీ యాడ్ ఇవ్వలేదు. అప్పట్లోనే సాక్షి మాకు కవరేజ్ ఇవ్వదని ఓ నిరసనలో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు పార్టీ ప్రకటన వేళ అన్నయ్య పత్రికకు అడ్వటైజ్ మెంట్ ఇవ్వకపోవడంతో షర్మిల, జగన్ మధ్య విభేదాలు నిజమేనని తెలుస్తోంది.

ఇక మరో విశేషం ఏంటంటే.. వైఎస్ షర్మిల ఇచ్చిన ప్రకటనలో తల్లి విజయమ్మ ఫొటో పెట్టకపోవడం కూడా చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి అన్నయ్య, తల్లి సపోర్టు లేకుండానే తెలంగాణలో తాను రాజకీయం చేస్తానని.. ఒంటరిగానే వెళుతానని షర్మిల హింట్ ఇచ్చినట్టు అయ్యింది.

దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నేడు వైఎస్ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ సభ జరుగనుంది. ఇప్పటికే ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా పేరును ఖరారు చేశారు. సభకు సంబంధించి రోడ్డు మ్యాప్ తాజాగా ఖరారైంది. నేడు వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపుల పాయకు చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు షర్మిల అక్కడ వైఎస్ఆర్ ను నివాళులర్పించి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు జేఆర్సీ కన్వేన్షన్ చేసుకొని 5 గంటలకు పార్టీ ఆవిర్భావ ప్రకటన.. జెండాను ఆవిష్కరిస్తారు.

జేఆర్సీ కన్వేన్షన్ సెంటర్ లో జరిగే పార్టీ ఆవిర్భావానికి ఒక్కో జిల్లా నుంచి 2వేల మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఆవిర్భావానికి ఇన్విటేషన్ ఉన్న వారికే అనుమతిస్తున్నారు.పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున జనాలను తరలిస్తున్నారు. వారి ముందు పార్టీ ఆవిష్కరణ చేయాలని షర్మిల నిర్ణయించారు. పెద్ద ఎత్తున పార్టీ కండువాలు సిద్ధం చేశారు.

జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాను తెలంగాణ మ్యాప్ తోపాటు వైఎస్ఆర్ చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. 80శాతం పాలపిట్ట రంగు.. 20శాతం నీలిరంగు ఉంటుంది. మొదట 8న పార్టీ ఆవిర్భావం వేళ వైఎస్ఆర్ విగ్రహాలు సిద్ధం చేసి నివాళులర్పించాలని వైఎస్ షర్మిల తొలి పిలుపు ఇచ్చారు.