Begin typing your search above and press return to search.

మే 6 నుంచే విశాఖ రాజధాని పాలన?

By:  Tupaki Desk   |   25 March 2021 5:30 PM GMT
మే 6 నుంచే విశాఖ రాజధాని పాలన?
X
జగన్ సర్కార్ ఏర్పడ్డప్పటి నుంచి కోర్టుల్లో నిర్ణయాలపై ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏపీ మూడు రాజధానులు, అమరావతి వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. జడ్జీల తీర్పులపై సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాసిన జగన్ సంచలనం సృష్టించారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు రాజధానిని తరలించడంలో జాప్యం చేయరాదని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ఖాయం చేసిన జగన్ ఈ మేరకు అన్ని విభాగాల అధిపతులు (హెచ్.ఓ.డీ)లకు ఆదేశాలు జారీ చేశారని.. వారిని విశాఖకు పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జగన్ 130 మంది హెచ్.ఓ.డీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా తమకు అనువైన ప్రాంతాలను ఎంచుకునేందుకు విశాఖలో తిష్టవేసినట్లు తెలుస్తోంది. అమరావతి నుంచి హెచ్.ఓ.డీలను విశాఖకు తరలించేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

మే 6వ తేది నుంచి అన్ని శాఖలు విశాఖ కేంద్రంగా పనిచేసే ఏర్పాట్లు సాగుతున్నాయి. సరిగ్గా మే 30 నాటికి జగన్ సీఎంగా ప్రమాణం చేసి రెండేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో మే 6 నుంచి విశాఖలో హెచ్.ఓ.డీలను ప్రారంభిస్తే 24 రోజుల్లోపు పరిపాలనను గాడిలోకి తీసుకొచ్చి ముచ్చటగా మూడో ఏడాది నుంచి మూడు రాజధానుల నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రాజధానులు అమరావతిపై కోర్టుల్లో చిక్కులు ఉన్నా మూడు రాజధానులపై జగన్ దూకుడు చర్చనీయాంశమవుతోంది.