Begin typing your search above and press return to search.

హిమాచల్‌ ప్రదేశ్‌ లో బీజేపీ కొంపముంచిన రెబల్స్‌!

By:  Tupaki Desk   |   8 Dec 2022 12:30 PM GMT
హిమాచల్‌ ప్రదేశ్‌ లో బీజేపీ కొంపముంచిన రెబల్స్‌!
X
హిమాచల్‌ ప్రదేశ్‌ లో అధికార బీజేపీకి రెబల్స్‌ గట్టి షాకే ఇచ్చారు. వాస్తవానికి హిమాచల్‌ ప్రదేశ్‌ లోనూ బీజేపీనే అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు ప్రకటించాయి. అందుకు తగ్గట్టే డిసెంబర్‌ 8న ఫలితాల వెల్లడిలో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వా.. నేనా అన్నట్టు పోటీపడ్డాయి. ముందు బీజేపీ మొత్తం 68 స్థానాల్లో సగానికి పైగా సీట్లలో ఆధిక్యంలోకి దూసుకుపోయింది.

అయితే ఆ తర్వాత నుంచి బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు తగ్గుతూ రాగా కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉన్న స్థానాలు పెరుగుతూ వచ్చాయి. డిసెంబర్‌ 8న మధ్యాహ్నం 3 గంటల సమయానికి హిమాచల్‌ ప్రదేశ్‌ లో మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 34 స్థానాల్లో గెలుపొందింది. మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించింది. మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ సారథ్యంలోని ఆప్‌ కు ఒక్క సీటు కూడా దక్కలేదు.

68 స్థానాలు ఉన్న హిమాచల్‌ లో ప్రభుత్వ ఏర్పాటుకు 35 స్థానాలు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్‌ ఈ సంఖ్యకు చేరువైంది. 34 స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఇంకా ఆరు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం పక్కా.

కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని రెబల్స్‌ చావు దెబ్బ తీశారని నిపుణులు చెబుతున్నారు. ఏకంగా 12 స్థానాల్లో రెబల్స్‌ బీజేపీకి భారీగా గండి కొట్టారని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో చాలామందికి సీట్లు ఇవ్వలేదు. గుజరాత్‌ లో మాదిరిగానే హిమాచల్‌ లోనూ చాలా మంది సిట్టింగులను పక్కనపెట్టింది. దీంతో వారంతా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. 12 స్థానాల్లో రెబల్స్‌ బరిలోకి దిగి బీజేపీ అభ్యర్థుల ఓటు బ్యాంకును చీల్చారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ఈ 12 స్థానాల్లో మేలు జరిగింది.

3 చోట్ల స్వతంత్రులు గెలుపొందగా వీరంతా బీజేపీ రెబల్స్‌ అభ్యర్థులేనని చెబుతున్నారు. మరోవైపు యాపిల్‌ రైతులు సైతం బీజేపీకి ఈసారి ఓట్లేయలేదని అంటున్నారు. యాపిల్స్‌ కు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, బీజేపీ ప్రభుత్వం తమను ఆదుకోకపోవడంతో వారంతా ఈసారి కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారని పేర్కొంటున్నారు.

ఓవైపు రెబల్స్, మరోవైపు యాపిల్‌ రైతులు కొట్టిన దెబ్బకు బీజేపీ ఓటమి పాలయ్యిందని అంటున్నారు. ఏకంగా ఆరుగురు బీజేపీ మంత్రులు ఓటమి బాటలో ఉండటం ఇందుకు నిదర్శనమంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.