Begin typing your search above and press return to search.

రైల్వే స్టేష‌న్‌ మొత్తం ఏసీనే.. దేశంలోనే ఫ‌స్ట్‌!

By:  Tupaki Desk   |   18 March 2021 1:30 AM GMT
రైల్వే స్టేష‌న్‌ మొత్తం ఏసీనే.. దేశంలోనే ఫ‌స్ట్‌!
X
మ‌న దేశంలో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అభివృద్ధి క‌నిపిస్తూ ఉంటుంది. ఓ వైపు సింగిల్ రైల్వే ట్రాక్ లేక అవ‌స్థ‌లు ప‌డే ప్రాంతాలు కోకొల్ల‌లుగా ఉంటాయి. మ‌రోవైపు బుల్లెట్ రైలు వ‌చ్చేందుకు కొన్ని స్టేష‌న్లు సిద్ధ‌మ‌వుతుంటాయి. తాజాగా.. ఓ రైల్వే టెర్మిన‌ల్ మొత్తం ఏసీతో రూపుదిద్దుకుంది. అత్యాధునిక టెక్నాల‌జీ, వ‌స‌తుల‌తో రూపొందిన ఈ టెర్మిన‌ల్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

బెంగ‌ళూరు న‌గ‌రంలోని బ‌య్య‌ప్ప‌న్ హళ్లి ప్రాంతంలో ఈ రైల్వే స్టేష‌న్ ను నిర్మించారు. దేశంలో సెంట్ర‌లైజ్డ్ ఏసీతో నిర్మించ‌బ‌డిన తొలి రైల్వే టెర్మిన‌ల్ ఇదే. ఈ టెర్మిన‌ల్ లో త్వ‌ర‌లోనే కార్య‌క‌లాపాలు ప్రారంభం కానున్నాయని రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

మొత్తం 314 కోట్ల వ్య‌యంతో ఈ టెర్మిన‌ల్ ను నిర్మించారు. మొత్తం 4,200 చ‌ద‌ర‌పు మీట‌ర్ల విస్తీర్ణంలో నిర్మించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్ర‌యాణికులు రాక‌పోక‌లు సాగించే సామ‌ర్థ్యం క‌లిగిన ఈ రైల్వే స్టేష‌న్లో మొత్తం ఏడు ప్లాట్ ఫాంలు ఇందులో ఉన్నాయి.

ఇక‌, పార్కింగ్ కోసం విశాల‌మైన స్థ‌లం కేటాయించారు. 900 బైకులు, 250 వ‌ర‌కు కార్లు నిలుపుకునేందుకు స్థ‌లం ఏర్పాటు చేశారు. ఇంతేనా.. క్లాస్ వెయింటింగ్ మాల్‌, వీఐపీ లాంజ్‌, ఎస్క‌లేట‌ర్‌, లిఫ్టులు, రెండు స‌బ్ వేలు, ఫుడ్ కోర్టు.. మొత్తంగా ధ‌న‌వంతుల‌కు ఎలాంటి సౌక‌ర్యాలు కావాలో.. అవ‌న్నీ ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి. దేశంలో ఇలాంటి వాటిని మ‌రిన్ని నిర్మించాల‌ని చూస్తోంది ప్ర‌భుత్వం.