Begin typing your search above and press return to search.

పోలవరం: ఏపీ వాదనే నెగ్గింది.. సవరించాల్సిందే!

By:  Tupaki Desk   |   3 Nov 2020 6:00 AM GMT
పోలవరం: ఏపీ వాదనే నెగ్గింది.. సవరించాల్సిందే!
X
సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్ట్ పూర్తి చేయడం సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ మేరకు సీఎం జగన్ ప్రధాని మోడీకి పోలవరం అథారిటీకి, కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకెళ్లారు. 2017-18 సవరించిన ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలని కోరారు.

ఏపీ ప్రభుత్వ వాదనతో తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఏకీభవించింది. 2013-14 ధరల ప్రకారం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రానికి వివరిస్తామని తెలిపింది. 2017-18 ధరల ప్రకారం ప్రాజెక్ట్ కు నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది.

ఇక పోలవరం ప్రాజెక్ట్ పనులకు 2014 ఏప్రిల్ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4730.71 కోట్లకు పీపీఏ ఆమోదం తెలిపింది. పోలవరం నీటిపారుదల విభాగం వ్యయాన్ని 2013-14 ధరల ప్రకారం రూ.20398.61 కోట్లుగా నిర్ధారించింది. పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు 2014 ఏప్రిల్ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.4730.71 కోట్లను వ్యయం చేసిందని.. ఆ వ్యయం సక్రమమని కాగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. దానిని పరిశీలించిన పీపీఏ ఆ వ్యయాన్ని నిర్ధారించి ఆమోదించింది.

కాగా ప్రాజెక్ట్ నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించడంపై పీపీఏ చర్చించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని.. కేవలం వీటికే రూ.28,191.03 కోట్లు అవసరమని ఆర్‌సీసీనే తేల్చిన అంశాన్ని పీపీఏ గుర్తుచేసింది. మరోవైపు పీపీఏ, సీడబ్ల్యూసీ, టీఏసీలు 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించాయని, ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లతో అంచనా వ్యయాన్ని ఖరారు చేసిందని, ఇప్పుడు 2013–14 ధరలను ప్రస్తావించడం ఎంతవరకు సబబని ఏపీ ప్రభుత్వం తరుఫున వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన పీపీఏ.. 2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని పీపీఏ పేర్కొంది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వ వాదనతో పీపీఏ ఏకీభవించింది. ఇతర జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చినట్టుగానే పోలవరం ప్రాజెక్ట్ కు నీటి పారుదల విభాగం వ్యయాన్ని విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని పీపీఏ స్పష్టం చేసింది. నిధుల విడుదల చేయాలని కోరుతామని పీపీఏ చైర్మన్ ఏపీ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.