Begin typing your search above and press return to search.

మనవరాలిని కిడ్నాప్ చేయించిన వృద్ధురాలు.. రీజ‌న్‌ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి!

By:  Tupaki Desk   |   11 July 2021 9:13 AM GMT
మనవరాలిని కిడ్నాప్ చేయించిన వృద్ధురాలు.. రీజ‌న్‌ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి!
X
మ‌నుషులు ఎలా త‌యార‌య్యారంటే.. అవ‌త‌లి వాళ్లకు మ‌న‌సు అనేది ఒక‌టి ఉంట‌ద‌నే విష‌యాన్నే వీళ్లు గుర్తించారు. గుర్తించినా.. దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. త‌మ‌కు న‌చ్చిందే జ‌రగాల‌ని కోరుకుంటారు. ఇందుకోసం ఎంత‌కైనా తెగిస్తారు. ఈ జాబితాకే చెందిన ఓ వృద్ధురాలు సొంత మ‌న‌వ‌రాలిని కిరాయి మూక‌ల‌తో కిడ్నాప్ చేయించింది. ఎందుకో తెలిస్తే మాత్రం షాకై పోతారు!

చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు చెందిన ల‌క్ష్మికి 14 సంవ‌త్స‌రాల కూతురు ఉంది. ల‌క్ష్మి త‌ల్లి ఓబుళ‌మ్మకు ఓ కోరిక ఉంది. ల‌క్ష్మి కూతూరిని త‌న కొడుకు కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాల‌ని చూస్తోంది. అంటే.. మ‌న‌వ‌రాలిని(కూతురు కూతూరు) మ‌న‌వ‌డికి (కొడుకు కొడుకు) ఇచ్చి పెళ్లి చేయించాల‌నేది ఆమె ప‌ట్టుద‌ల‌. ల‌క్ష్మి అన్న కూడా త‌న కొడుక్కి నీ కూతురిని ఇవ్వాల‌ని కోరేవాడు. కానీ.. దీనికి ల‌క్ష్మి అంగీక‌రించ‌లేదు.

దీనికి రెండు కార‌ణాలు చూపించేది ల‌క్ష్మి. ఓబుళమ్మ‌ మ‌న‌వ‌డు, ల‌క్ష్మి మేన‌ల్లుడు అయిన‌ ముర‌ళీకృష్ణ వ‌య‌సు 29 సంవ‌త్స‌రాలు. బెంగ‌ళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ల‌క్ష్మి కూతూరు వ‌య‌సు కేవ‌లం 14 సంవ‌త్స‌రాలు. అంటే.. వీరిద్ద‌రి మ‌ధ్య ఏకంగా 15 సంవ‌త్స‌రాల తేడా ఉంది. ఇంత వ‌య‌సు బేధం ఉన్నందున తన కూతురినిచ్చి పెళ్లి చేసేది లేద‌ని చెబుతోంది ల‌క్ష్మి. అంతేకాకుండా.. త‌న కూతురికి ఇంత చిన్న వ‌య‌సులో పెళ్లి చేస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌ని, పైగా బాగా చ‌దువుకుంటోంద‌ని, ఈ పెళ్లి చేయ‌లేన‌ని తెగేసి చెబుతోంది.

కానీ.. వృద్ధురాలు ఓబుళమ్మ మాత్రం ఇవేవీ ప‌ట్టించుకునేది కాదు. స‌మ‌యం, సంద‌ర్భం లేకుండా ఇదే మాట చెబుతూ ఉండేది. దీంతో.. ఈ విష‌యం త‌న వ‌ద్ద ప్ర‌స్తావించొద్ద‌ని, ఈ పెళ్లి జ‌ర‌గ‌ద‌ని ల‌క్ష్మి చెప్పింది. దీంతో.. వృద్ధురాలు ఏకంగా కిరాయి గూండాల‌తో మ‌న‌వ‌రాలిని కిడ్నాప్ చేయించింది. ఈ ప‌ని త‌న త‌ల్లే చేయించింద‌ని తెలుసుకున్న ల‌క్ష్మి.. వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.