Begin typing your search above and press return to search.

వైరల్ : ఏంటి స్వామి.. ఆర్గానిక్ మాస్క్ నా?

By:  Tupaki Desk   |   24 May 2021 1:30 PM GMT
వైరల్ : ఏంటి స్వామి.. ఆర్గానిక్ మాస్క్ నా?
X
కరోనా కాలంలో అల్లోపతి మందుల కన్నా ప్రకృతి సిద్ధమైన పదార్థాలపై జనాలకు అవగాహన పెరిగింది. రోగం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా రాకముందే జాగ్రత్త పడాలనే స్పృహ కలిగింది. అందుకనుగుణంగా ఎవరికి తోచిన కషాయాలు, చూర్ణాలు అంతేకాదండోయ్ మాస్కులను వాళ్లే తయారు చేసుకుంటున్నారు. ఓ స్వామిజీ రూపొందించిన మాస్కు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అసలే కరోనా రెండో దశ.. ఆపై కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న వేళ రెండు మాస్కులు వాడాలని వైద్య నిపుణులు ఇప్పటికే చాలా సార్లు చెప్పాపు. కానీ ఈ స్వామిజీ మాస్కు మాత్రం కాస్త భిన్నం.

ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన మాస్కును ధరించారు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ స్వామిజీ. జనప నార తాళ్లతో అల్లిన మాస్కులో మొత్తం తులసి, వేప ఆకులను నింపేశారు. అంతేకాకుండా ఆ మాస్కు ఉపయోగించడం వల్ల కలిగే లాభాలను ఆయన వివరించారు. తాను తీసుకున్న ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని చెప్పారు. వేప, తులసి ఆకులు రోగాలను దరి చేరనివ్వవని పేర్కొన్నారు. ఏదైనా సోకినా నయం చేస్తాయని తెలిపారు. వైద్యులు చెప్పై సర్జికల్ లేదా ఇతర రకాల మాస్కుల కన్నా చాలా బాగా పని చేస్తుందని అన్నారు.

ఈ సాధువు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కుర్లు కొడుతోంది. దీనిని ఐపీఎస్ అధికారి రుషిన్ శర్మ ట్వీట్ చేశారు. అంతేకాకుండా పలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మాస్కు పని చేస్తుందనే గ్యారెంటీ లేదని ఆయన అన్నారు. మీరు మాత్రం ఆయనలా ప్రయత్నించవద్దని సూచించారు. డాక్టర్లు సూచించిన విధంగా సర్జికల్, ఎన్95, కాటన్ మాస్కులను వాడాలని చెప్పారు. మాస్కులను ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని ట్వీట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ మాస్కు పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. వావ్ స్వామిజీ... మీ ఆలోచన అదుర్స్ అంటూ కొందరు పొగుడుతున్నారు. వేప, తులసి ఆకులతో మాస్క్ మంచి ఐడియా అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం 'ఈ కరోనా కాలంలోనూ ఆర్గానిక్ ఏంటి స్వామిజీ... ఈ మాస్క్ పని చేస్తుందా? అసలు' అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఆ సాధువు వీడియో వైరల్ గా మారింది.