Begin typing your search above and press return to search.

క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలెట్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన మధ్యప్రదేశ్ సర్కార్

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:30 AM GMT
క్రాష్ ల్యాండింగ్ చేసిన పైలెట్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన మధ్యప్రదేశ్ సర్కార్
X
విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో చోటు చేసుకున్న ఒక ప్రమాదానికి సంబంధించి తాజాగా సదరు పైలెట్ అందుకున్న నోటీసు నోటి వెంట మాట రాకుండా చేసింది. ఇందులో మధ్యప్రదేశ్ సర్కారు తీరు ఆసక్తికరంగా మారింది.

విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో అనూహ్యంగా ఎదురైన పరిణామాలతో క్రాష్ ల్యాండింగ్ చేయటం.. ఈ కారణంగా తమకు జరిగిన రూ.85 కోట్ల నష్టం గురించి సదరు పైలట్ కు నోటీసులు ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వ తీరు షాకింగ్ గా మారింది. ఈ ఉదంతంపై సదరు పైలెట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ.. సదరు పైలట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నోటీసు సారాంశాన్ని చూస్తే..

కొవిడ్ వేళ.. అహ్మదాబాద్ నుంచి గ్వాలియర్ కు 71 పెట్టెల రెమ్ డెసివిర్ స్టాకును తీసుకొని ఒక విమానం బయలుదేరింది. విమానాన్ని ల్యాండ్ చేసే సమయంలో ఎయిర్ పోర్టులోని ఒక బ్యారియర్ ను సదరు విమానం ఢీ కొట్టింది. దీంతో.. విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఉదంతంలో పైలెట్ మజిద్ అఖ్తర్.. కో పైలట్ శివ జైస్వాల్.. డిప్యూటీ తహసీల్దారు దిలీప్ ద్వివేది స్వల్పంగా గాయపడ్డారు.

ఈ ఇష్యూపై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ విచారణ జరుపుతోంది. పైలట్ అఖ్తర్ లైసెన్సును ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 2021 మే ఆరున చోటు చేసుకున్న ఈ ఉదంతంపై తాజాగా సదరు పైలట్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక నోటీసు జారీ చేసింది.

గ్వాలియర్ ఎయిర్ పోర్టులో జరిగిన క్రాష్ ల్యాండింగ్ కారణంగా తాము రూ.85 కోట్లు (రూ.60 కోట్లు తుక్కుగా మారిన ఎయిర్ క్రాఫ్ట్ కారణంగా.. రూ.25 కోట్లు మరో విమానాన్ని వాడినందుకు అయిన ఖర్చు) నష్టపోయామంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై సదరు పైలెట్ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాము ల్యాండింగ్ చేసే సమయంలో ఎయిర్ పోర్టులో బ్యారియర్ అడ్డుగా పెట్టిన విషయంపై తమకు ఎలాంటి సమాచారాన్ని ఎందుకు ఇవ్వలేదని సదరు పైలెట్ మండిపడుతున్నారు. అంతేకాదు.. విమానానికి ఇన్స్యూరెన్సు లేకుండా విమానాన్ని ఎగిరేందుకు ప్రభుత్వం ఎలా అనుమతిని ఇచ్చిందన్న సూటి ప్రశ్నను అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు మాత్రం మధ్యప్రదేశ్ సర్కారు సమాధానం చెప్పని పరిస్థితి.