Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వంకు ఆగస్టు 1 డెడ్ లైన్ పెట్టిన హైకోర్టు

By:  Tupaki Desk   |   15 July 2021 2:30 PM GMT
ఏపీ ప్రభుత్వంకు ఆగస్టు 1 డెడ్ లైన్ పెట్టిన హైకోర్టు
X
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు ఉంచడంపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లుల చెల్లింపు కోసం ఎన్నిసార్లు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడంపై సీరియస్ అయ్యింది. ఆగస్టు 1లోగా బిల్లులు చెల్లించాలని డెడ్ లైన్ విధించింది. విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

టీడీపీ హయాంలో ఉపాధి హామీ పనులు చేసిన వారికి బిల్లులను వైసీపీ ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్ లో పెట్టింది. వీరందరూ హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు ఈ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బిల్లులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో హైకోర్టు ఇవాళ మరోసారి సీరియస్ అయ్యింది. ఆగస్టు 1లోగా ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే పంచాయతీరాజ్, ఆర్థికశాకల ముఖ్య కార్యదర్శులు కోర్టుకు హాజరై సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.

ఇప్పటికీ వీరిద్దరూ ఓసారి కోర్టుకు హాజరై బిల్లుల చెల్లింపులపై వివరాలు అందించారు. అయినా ఇప్పటికీ బిల్లులు బకాయిలు చెల్లించకపోవడంతో హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఆదేశాలు ఎందుకు పాటించడంలేదని.. అమలుచేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారని నిలదీసింది.