Begin typing your search above and press return to search.

తిరుప‌తి వార్ వ‌న్ సైడ్‌.. వైసీపీ నేతల్లో గుస‌గుస..!‌

By:  Tupaki Desk   |   19 March 2021 2:30 AM GMT
తిరుప‌తి వార్ వ‌న్ సైడ్‌.. వైసీపీ నేతల్లో గుస‌గుస..!‌
X
తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి వ‌చ్చే నెల 17న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌లైన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ పార్టీ విజ‌యం సాధిస్తుంది ? ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు ? అనే విష‌యాల‌పై ఆస‌క్తి నెల‌కొంది. అయితే.. ఆదిలో ఇక్క‌డ తీవ్ర‌మైన పోరు ఉంటుందని.. టీడీపీ. వైసీసీ మ‌ధ్య‌ ఇక్క‌డ పార్టీల మ‌ధ్య పోరు సాగుతుంద‌ని.. అధికార పార్టీకి చుక్క‌లు చూపించేందుకు పార్టీలు స‌మాయ‌త్త‌మ‌య్యాయ‌ని.. పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. అయితే.. తాజాగా జ‌రిగిన మునిసిప‌ల్‌.. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత‌.. మాత్రం ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది.

ప్ర‌ధానంగా తిరుప‌తి పోరులో తాము పోటీ చేయాల‌ని.. జ‌న‌సేన భావించింది. అయితే.. దీనిని త‌మ‌కే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బీజేపీ ద‌క్కించుకుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల రిజ‌ల్ట్ చూశాక జ‌న‌సేన‌కు రేపు సీన్ ఎలా ఉండ‌బోతోందో అర్థ‌మైపోయింది. అందుకే ఆ పార్టీ తెలివిగా ఎస్కేప్ అయిపోయింది. ఇక ఈ సీటును బీజేపీకి వ‌దిలేసినా కూడా జ‌న‌సేన ఇప్పుడు ప్ర‌చారానికి దూరంగా ఉండే అవకాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన త‌న మిత్ర‌పక్షం బీజేపీపై నిప్పులు చెరుగుతోంది. దీంతో బీజేపీ నాయ‌కులు తిరుప‌తిలో.. జ‌న‌సేన‌ను వ‌చ్చి ప్ర‌చారం చేయ‌మ‌ని కోరే ప‌రిస్థితి లేకుండా పోతోంది. తిరుప‌తిలో బీజేపీ అభ్య‌ర్థి నిల‌బ‌డినా.. ఒంట‌రిగానే ప్ర‌చారం చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని ఇక్కడ నుంచి బ‌రిలోకి దిగారు. ఇప్ప‌టికే ప్ర‌చార వ్యూహం సిద్ధం చేసుకున్నారు. మండ‌లాల వారీగా కూడా పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. అందరూ క‌లిసి వ‌స్తార‌ని అనుకున్నారు. అయితే.. స్థానిక ఫ‌లితం వ‌చ్చిన త‌ర్వాత మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఒక విధమైన ఆందోళ‌న బ‌య‌ల్దేరింది. అస‌లు తాము అనుకున్న అభ్య‌ర్థి పోటీలో ఉంటారో ? లేదో తెలియ‌దు. అస‌లు ఎన్నిక‌ల వేళ ఎవ‌రు క‌లిసి వ‌స్తారో.. లేదో .. తెలియ‌ని ప‌రిస్థితి. పైగా అధికార పార్టీ.. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కేందుకు గ‌ట్టి ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇత‌ర పార్టీల‌ను చూస్తే.. డీలాప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే వైసీపీ నేత‌ల మ‌ధ్య ఈసీటు త‌మ ఖాతాలో ఇప్ప‌టికే ప‌డిపోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.