Begin typing your search above and press return to search.

ట్రంప్ వచ్చాడు.. అమెరికాలో భారతీయుడు చచ్చాడు!

By:  Tupaki Desk   |   24 Feb 2020 7:00 AM GMT
ట్రంప్ వచ్చాడు.. అమెరికాలో భారతీయుడు చచ్చాడు!
X
భారత్ మొత్తం అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ పైన చర్చ సాగుతుండగా.. ఓ విషాద వార్త వినిపించింది. ట్రంప్ మన దేశంలో పర్యటిస్తుండగా ఆయన దేశం అమెరికాలో భారతీయుడు హత్యకు గురయ్యాడు. దీంతో ట్రంప్ పర్యటనలో అమెరికాలో భారతీయుల దాడులపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. భారతీయులకు అమెరికాలో భద్రత లేదు. అప్పట్లో శ్రీనివాస్ కూచిభొట్ల కాల్పుల్లో మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ భారత పర్యటనకు బయల్దేరే ముందు ఈ ఘటన జరగడం గమనార్హం.

భారత్ లోని హర్యాణ రాష్ట్రం కర్నల్ ప్రాంతానికి చెందిన మణిందర్ (31) తన సోదరుడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఉంటుండడంతో ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. లాస్ ఏంజెల్స్ లోని విట్టియర్ ప్రాంతంలో ఉన్న కిరాణ దుకాణంలో మణిందర్ పని చేస్తున్నాడు. అయితే శనివారం ఉదయం 5.43 గంటల ప్రాంతంలో ముసుగు ధరించిన వ్యక్తి దుకాణానికి వచ్చాడు. తుపాకీ చూపించి డబ్బులు ఇవ్వమని బెదిరించడంతో మణిందర్ దుకాణంలో ఉన్న డబ్బులు ఇచ్చాడు. అయితే వెళ్తు వెళ్తూ ఆ దుండగుడు మణిందర్ ను తుపాకీతో కాల్చి డబ్బుతో పరారయ్యాడు. దీంతో దుకాణంలో వారంతా భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న హర్యాణాలోని కర్నల్ లో నివసిస్తున్న కుటుంబసభ్యులు బోరున విలపించారు. అక్కడ పని చేస్తూ నెలకు కొంత డబ్బులు మణిందర్ భార్యాపిల్లల కోసం పంపించేవాడు. అమెరికా వెళ్లిన ఆరు నెలల్లోనే తమను వదిలేసి వెళ్లిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అయితే మణిందర్ మృతదేహం భారత్ కు తీసుకువచ్చేంత స్థోమత ఆ కుటుంబానికి లేదు. అందుకే మృతుడి సోదరుడు ఫేస్ బుక్ లో ‘గో ఫండ్ మీ’ అనే పేజీ క్రియేట్ చేసి ఆర్థిక సహాయం కోరుతున్నాడు. విరాళాలు వస్తే ఆ డబ్బుతో సోదరుడి మృతదేహం భారత్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది.

భారత్ లో పర్యటిస్తున్న సమయంలోనే అమెరికాలో భారతీయుడు కాల్పుల్లో బలవడం చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉంటున్న భారతీయులకు భద్రత కల్పించాలని ప్రవాస భారతీయులు ట్రంప్ తో మాట్లాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూచిస్తున్నారు.