Begin typing your search above and press return to search.

తబ్లీగ్ జమాత్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. వారిని బలిపశువులు చేశారు

By:  Tupaki Desk   |   23 Aug 2020 6:30 AM GMT
తబ్లీగ్ జమాత్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. వారిని బలిపశువులు చేశారు
X
దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి కొందరి అభిప్రాయాల్లోని తప్పును ఎత్తి చూపేలా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా దేశంలో పెద్దగా వ్యాపించని సందర్భంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కాజ్ లో నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి కారణంగా దేశంలో పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి చెందినట్లుగా వ్యాఖ్యానించటం తెలిసిందే. దీనికి సంబంధించిన పలువురు విదేశీ పౌరుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇందులో భాగంగా 29 మంది విదేశీయులపై మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుల్ని కొట్టివేస్తూ.. ముంబయి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. దేశంలో కరోనా వ్యాప్తికి వారు కారణమంటూ అనవసర ప్రచారం జరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని.. రాజకీయ బలవంతంతోనే రాష్ట్ర సర్కారు వ్యవహరించిందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. వీరిపై సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేసినందుకుసోషల్ మీడియాపైనా బాంబే హైకోర్టు ఔరంగాబాద్ ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

కరోనా వ్యాప్తికి కారణమైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 29 మంది విదేశీ పౌరులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయటం.. వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా జరిగిన విచారణలో భాగంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ.. తబ్లిగీ జమాత్ కార్యక్రమాలు గడిచిన యాభై ఏళ్లుగా సాగుతుందని.. అతిథుల్ని స్వాగతించే గొప్ప సంప్రదాయం మనదని.. ఆ సంస్కృతిని భారత దేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా? అంటూ ధర్మాసనం ప్రశ్నను సంధించింది.

విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని చెప్పటం గమనార్హం. మరోసారి ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు తబ్లీగీలపై పెద్ద ఎత్తున సాగిన విష ప్రచారం చేసిన వారంతా.. తాజా కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఎలా రియాక్టు అవుతారో చూడాలి.