Begin typing your search above and press return to search.

ప్రభుత్వాల కూల్చివేతల్లో బీజేపీ కొత్త రికార్డు...?

By:  Tupaki Desk   |   22 Jun 2022 8:14 AM GMT
ప్రభుత్వాల కూల్చివేతల్లో బీజేపీ కొత్త రికార్డు...?
X
కమలం పార్టీ రాజకీయ కళలలో ఆరితేరిపోయింది. ఆ పార్టీ చూపు పడితే చాలు అంతవరకూ చల్లగా హాయిగా ఉన్న ప్రభుత్వాలు కుప్ప కూలడం ఖాయమని అంటారు. అదే నిజం కూడా. ముఖ్యంగా మోడీ ప్రధాని అయ్యాక గత ఎనిమిదేళ్ళలో బీజేపీ నిష్కారణంగా కూల్చిన ప్రభుత్వాలు చాలా ఎక్కువే. నిజానికి అవన్నీ మెజారిటీతో పచ్చగా పాలన చేస్తున్నవే. అయితే బీజేపీ కన్ను వాటి మీద పడింది. దెబ్బకు కుప్పకూలిపోయాయి.

అలా లిస్ట్ చూస్తే చాలా పెద్దది, ప్రస్తుతం మహారాష్ట్రలో మూడు పార్టీలతో కలసి చల్లగా కాపురం చేసుకుంటున్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తెర వెనక నుంచి కత్తులు అందిసొతంది. తెర మీద శివ సైనికుడు రెబెల్ మంత్రి ఏక్ నాధ్ అవతార్ కనిపిస్తున్నారు. కానీ దర్శకత్వం అంతా కమలనాధులదే అని ఆరోపిస్తున్నారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పెట్టిన క్యాంప్ రాజకీయాలు మొదట గుజరాత్ లోని సూరత్ లో సాగాయి. ఇపుడు మరింత బెస్ట్ ప్లేస్ అని అసోం కి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అంతే కాదు ఈ తిరుగుబాటు శిబిరానికి వచ్చి బీజేపీ నేతలు పలకరింపులూ పరామర్శలు చేస్తున్నారు. ఏతా వాతా తేలేది ఏంటి అంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే సర్కార్ కి మూడిందని.

ఇక ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ని నిలువునా కూల్చిన పాపం కమలానిదే. 2018లో ఎన్నికలు జరిగి 121 సీట్లతో కమలనాధ్ నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడితే దాన్ని కూల్చివేస్తే కానీ కమలం పార్టీ నిద్రపోలేదు. కాంగ్రెస్ లో ఉన్న జ్యోతిరాదిత్యను తన వైపునకు తిప్పుకుని 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చీల్చి కధ నడిపించింది బీజేపీ. ఆ మీదట కమలనాధ్ సర్కార్ కూలితే ఆ ప్లేస్ లో 2020 మార్చిలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేశారు.

అలాగే కర్నాటకలో 2018లో ఎన్నికలు జరిగాయి. 104 సీట్లు తమకు వచ్చాయన్న కారణంతో యడ్యూరప్పను ముందు పెట్టి మొదట ప్రభుత్వం ఏర్పాటు చేసింది కమలం. కానీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా కూడా మెజారిటీ దక్కలేదు. దాంతో రోజుల వ్యవధిలోనే కుప్పకూలింది. ఇక కాంగ్రెస్ జేడీఎస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే వారి పాలన సవ్యంగా సాగలేదు అనే కంటే బీజేపీ సాగనివ్వలేదు అనే అంటారు అంతా. అలా కూటమిలో చిచ్చు రేపి మొత్తానికి ఆ సర్కార్ ని పడగొట్టారు. జేడీఎస్ నుంచి 16 మందిని బీజేపీ తన వైపు తిప్పుకుని 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదే తీరున చూస్తే 2017లో మణిపూర్ లో 60 సీట్లకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి 28 సీట్లు వచ్చాయి. కానీ పెద్ద పార్టీని కాదని 21 సీట్లు వచ్చిన బీజేపీని గవర్నర్ ఆహ్వానిచడంతో కధను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ ని చీల్చి తొమ్మిది మంది ఆ పార్టీ నుంచి వచ్చిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని మణిపూర్ లో బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ విషమలో గవర్నర్ ని అడ్డం పెట్టుకున్నారు అన్న విమర్శలు బీజేపీ మీద వచ్చాయి.

అదే విధంగా కాశ్మీర్ ని పాలించాలన్నది దశాబ్దాల కోరిక బీజేపీది. మోడీ హయాంలో ఎట్టకేలకు అది తీరింది. 2014లో ఎన్నికలు జరిగితే బీజేపీకి పాతిక, పీడీఎఫ్ కి 28 సీట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా సవ్యంగా పాలన సాగనివ్వలేదు కమలం నేతలు అంటారు. మొత్తానికి ఈ సర్కార్ ని కూడా కూలగొట్టిన పాపం బీజేపీదే. మద్దతు ఉపసంహరించుకోవడంతో కుప్ప కూలిన ఈ ప్రభుత్వం తరువాత రాష్ట్రాప్తి పాలంతో నేరుగా కేంద్రమే పాలిస్తోంది. ఈ లోగా ఆర్టికల్ 370ని రద్దు చేసి తన ఆట సాగేటట్టుగా చేసుకుందని విమర్శలు ఉన్నాయి.

మరో వైపు చూస్తే 2016లో ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ సర్కార్ కూలడం వెనక ఆ పార్టీ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడం వెనక కూడా బీజేపీ హ్యాండ్ ఉందని అంటారు. అలా కాంగ్రెస్ సర్కార్ ని కూలదోసి రాష్ట్రపతి పాలన పెట్టి ఆనక జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచేసింది. మొత్తానికి కాంగ్రెస్ ని మాత్రం సవ్యంగా పాలించనివ్వలేదు అన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ టోటల్ స్టోరీలో అరుణాచల్ ప్రదేశ్ ది ఒక వింత కధ. అక్కడ 2014లో ఎన్నికలు జరిగితే బీజేపీకి బలం 11 సీట్లు మాత్రమే. అదే కాంగ్రెస్ కి 42 సీట్లు వచ్చాయి. అంటే మూడింట రెండు వంతులు అన్న మాట. అలా కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పడిన సర్కార్ ని కూల్చడానికి ఏకంగా కాంగ్రెస్ సీఎం సహా 42 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని ఓవర్ నైట్ తమ ప్రభుత్వాన్ని స్థాపించిన ఘనత కమలనాధులదే అంటే వింత ఇంతకంటే ఏముంటుంది.

ఇంకో వైపు చూస్తే బీహార్ స్టోరీ కనిపిస్తుంది. 2015లో అక్కడ ఎన్నికలు జరిగాయి. నితీష్ కుమార్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ తో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. రెండేళ్ళు తిరిగేసరిని అంటే 2017లో ఈ సర్కార్ మీద కన్ను వేసిన బీజేపీ నితీష్ ని తమ వైపునకు తిప్పుకుని ఆ కూటమి ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టి సర్కార్ ని కూలగొట్టేసింది. అలా నితీష్ ని తమతో ఉంచుకుని బీజేపీ భాగస్వామ్యంతో బీహార్ లో సర్కార్ ని ఏర్పాటు చేసింది.

ఇక గోవా కధ వెరీ స్పెషల్. ఇక్కడ ఎపుడూ బీజేపీకి మెజారిటీ సీట్లు రాకపోయినా పాలన మాత్రం వారిదే. ఈ విడ్డూరం ఎలా సాధ్యం అంటే అదే కాషాయం మార్క్ స్ట్రాటజీ అని చెప్పాలి. 2017లో గోవాలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి 17, బీజేపీకి 13 వచ్చాయి. మొత్తం నలభై మంది ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా సర్కార్ ఏర్పాటు చేయాలి. కానీ బీజేపీ ఇతర పార్టీలను సమీకరించడమే కాదు, కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యేను తెచ్చి మరీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసింది. రెండెళ్ళ తరువాత అదే కాంగ్రెస్ నుంచి మరో పదిహేను మందిని తెచ్చి ఏకంగా మొత్తం ఎమ్మెల్యేలను కలిపేసుకుంది.

ఇలా లెక్క తీస్తే కేవలం ఎనిమిదేళ్ళ బీజేపీ ఏలుబడిలో కూలగొట్టిన ప్రభుత్వాలే ఎక్కువ. బీజేపీ దేశమంతా ఉండాలి. తామే పాలించాలి అన్న దురాశతో ఆడుతున్న ఈ రాజకీయ వికృత క్రీడ ఒకనాటి కాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తూ మించి పోయింది అంటున్నారు. అయితే కాలం ఎపుడూ ఒకలా ఉండదు. రేపటి రోజున ఈ తప్పులకు బదులు బీజేపీ కూడా తీర్చుకునే రోజు వస్తుంది అని విపక్షాలతో పాటు ప్రజాస్వామ్య ప్రియులు మేధావులు అంటూంటారు.