Begin typing your search above and press return to search.

ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థలం అదే.. ప్ర‌క‌టించిన పండితులు!

By:  Tupaki Desk   |   1 Aug 2021 6:34 AM GMT
ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థలం అదే.. ప్ర‌క‌టించిన పండితులు!
X
'ఆంజ‌నేయుడు ఎవ‌రివాడు? మారుతి జన్మస్థలం ఏదీ?' అనే అంశంపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఏకాభిప్రాయం రాక‌పోవ‌డం తెలిసిందే. హ‌న‌మంతుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే జ‌న్మించాడంటూ శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. తిరుమల ఏడు కొండల్లోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థానమని టీటీడీ స్పష్టం చేసింది. అంజనాద్రిలోని జాపాలీ తీర్థంలో ఆంజ‌నేయుడు జ‌న్మించాడ‌ని ప్రకటించింది. దీంతో.. క‌ర్నాట‌కు నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. మారుతి తమ ప్రాంతానికి చెందిన వాడని, దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయ‌ని క‌ర్నాట‌క ప్ర‌క‌టించింది.

క‌ర్నాక‌ట రాష్ట్రంలోని హంపి స‌మీపంలో ఉన్న ఆంజ‌నేయాద్రి కొండ హ‌నుమంతుడి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని క‌ర్నాట‌క స‌ర్కారు ప్ర‌క‌టించింది. ఈ విష‌యం రామాయ‌ణంలోనూ స్ప‌ష్టంగా ఉంద‌ని చెప్పింది. ఆ త‌ర్వాత క‌ర్నాట‌క రాష్ట్రానికి చెందిన హ‌నుమ‌త్ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ తీవ్రంగా స్పందిస్తూ.. ఘాటు లేఖ కూడా టీటీడీకి రాసింది. బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాలని కోరింది.

ఈ నేప‌థ్యంలోనే ఈ మే 27వ తేదీన‌ ఇరు ప‌క్షాలు తిరుప‌తిలో చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌య్యాయి. తిరుమ‌ల సంస్కృత విద్యాపీఠంలో జ‌ర‌గ‌నున్న భేటీలో.. రెండు రాష్ట్రాల‌కు చెందిన పండితులు పాల్గొన్నారు. ఈ భేటీలో టీటీడీ పండితుల క‌మిటీకి చైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన ప్రొఫెస‌ర్ ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, క‌ర్నాట‌కలోని హ‌నుమ‌ద్ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు వ్య‌వ‌స్థాప‌కుడు గోవిందానంద‌ స‌రస్వ‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు. కుప్పా విశ్వ‌నాథ శాస్త్రి న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించారు.

అయితే.. ఈ చ‌ర్చ‌ల్లో ఎవ‌రి వాద‌న వారు వినిపించ‌గా.. చ‌ర్చ‌ల అనంత‌రం కూడా అస‌లు విష‌యం తేల‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ భేటీ త‌ర్వాత ముర‌ళీధ‌ర శ‌ర్మ మాట్లాడుతూ.. పురాణాలు, ఇతిహాసాల ప్ర‌కారం హ‌న్మంతుని జ‌న్మ‌స్థానం తిరుప‌తి ఏడు కొండ‌ల్లోని అంజ‌నాద్రేన‌ని చెప్పారు. క‌ర్నాట‌క‌లోని పంపాన‌ది ఒడ్డున ఉన్న అంజ‌న‌హ‌ళ్లి హ‌న్మంతుడి జ‌న్మ‌స్థాన‌మ‌ని రామాయ‌ణంలో ఉంద‌ని గోవిందానంద స‌ర‌స్వ‌తి చెబుతున్నార‌ని, కానీ.. దానికి ఆయ‌న స‌రైన ఆధారాలు చూప‌లేద‌ని చెప్పారు.

రామాయ‌ణంలో కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, ఉత్త‌రకాండ‌లో హ‌నుమంతుడి జ‌న్మ‌వృత్తాంతం గురించి మాత్ర‌మే ఉంద‌ని, జ‌న్మ‌స్థానం గురించిన ప్ర‌స్థావ‌నే లేదని ముర‌ళీధ‌ర శ‌ర్మ చెప్పారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న త‌ర్వాత న్యాయ‌నిర్ణేత‌గా ఉన్న కుప్పా విశ్వ‌నాథ శాస్త్రి కూడా టీటీడీకే మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు. గోవిందానంద స్వామి వాద‌న‌లో స్ప‌ష్ట‌త లేద‌ని చెప్పార‌ని అన్నారు.

ఈ చ‌ర్చ అనంత‌రం గోవిందానంద మాట్లాడుతూ.. హ‌న్మంతుడి జ‌న్మ‌స్థానంపై టీటీడీ చేసిన ప్ర‌క‌ట‌న ఆక్షేప‌ణీయం అని అన్నారు. ఈ విష‌య‌మై పెద్ద‌జీయ‌ర్‌, చిన్న జీయ‌ర్‌, శృంగేరి పీఠాధిప‌తి శంక‌రాచార్యులు, కంచి పీఠాధిప‌తి త‌దిత‌రులు చెబితే ధ‌ర్మ‌బ‌ద్ధం అవుతుంద‌ని ఆయ‌న వ్యాక్‌యానించారు. టీటీడీ పండితుల క‌మిటీలో పెద్ద జీయ‌ర్ కు ఎందుకు చోటు క‌ల్పించ‌లేద‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. రామాయ‌ణం ప్ర‌కారం హ‌న్మంతుడు హంపిలోనే జ‌న్మించాడ‌న్న గోవిందానంద‌.. దీనిపై టీటీడీ బ‌హిరంగ చ‌ర్చ జ‌ర‌పాల‌ని అన్నారు. దీంతో.. ఆంజ‌నేయుడి జ‌న్మ‌స్థ‌ల వివాదం పీఠ‌ముడిగానే మిగిలిపోయిన‌ట్టైంది.

ఈ క్ర‌మంలో తాజాగా.. టీటీడీ ఆధ్వ‌ర్యంలో రెండు రోజులపాటు వెబినార్ నిర్వ‌హించారు. ఈ వెబినార్ లో పాల్గొన్న ప్రముఖులు పండితులంతా అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమని మ‌రోసారి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. ఈ విష‌యంలో విమర్శలు చేసిన వారిపైనా మండిపడ్డారు. సంస్కృతం, పురాణం, శాస్త్రాల గురించి వారికి తెలియద‌ని, అలాంటి వారికి ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. పండిత పరిషత్ చైర్మన్ మురళీధర్ మాట్లాడుతూ.. అంజనాద్రే హనుమంతుని జన్మస్థలమ‌ని తాము చేసిన‌ ప్రకటనను ఇద్ద‌రు ముగ్గురే వ్యతిరేకించారని అన్నారు. అందుకే.. ఈ వెబినార్ నిర్వ‌హించామ‌ని, ఇందులో పాల్గొన్నవారందరూ తిరుమలే హనుమంతుని జన్మస్థలమ‌ని ముక్తకంఠంతో తేల్చేశారని వెల్లడించారు.

అనంత‌రం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి కూడా మాట్లాడారు. హనుమంతుడు తిరుమలలోనే పుట్టాడని తాము మూర్ఖంగా ఏమీ వాదించడం లేదని చెప్పారు. ఇప్పుడు కూడా ఎవ‌రి వ‌ద్ద‌నైనా భిన్న ఆధారాలు ఉంటే చూపించొచ్చ‌ని అన్నారు. తాము త్వరలోనే ఓ గ్రంధం విడుదల చేయబోతున్నామని, దీనిపై ఎవ్వ‌రైనా వాదనకు రావచ్చుని, అయితే.. దూషించే ప్రయత్నం చేయవద్దని అన్నారు. ఓ స్వామీజీ తమను దూషించడం తప్ప, ఆధారాలేవీ చూపలేదన్నారు. మొత్తానికి.. టీటీడీ మ‌రోసారి హ‌నుమంతుడు త‌మ‌వాడేన‌ని ప్ర‌క‌టించుకుంది. మ‌రి, పోటీగా మ‌ళ్లీ ఎవ‌రు వ‌స్తారో చూడాలి.