Begin typing your search above and press return to search.

అటు అఖండ భారతం.. ఇటు ఇస్లామిక్ దేశం

By:  Tupaki Desk   |   18 April 2022 11:30 PM GMT
అటు అఖండ భారతం.. ఇటు ఇస్లామిక్ దేశం
X
ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్న దేశం భారత్ అన్నది తెలిసిందే. ప్రపంచాన రెండు వందల దాకా దేశాలు ఉంటే క్రిస్టియానిటీని, ఇస్లాం ని విశ్వసించే దేశాలు, వందకు పైగా దేశాలు ఉన్నాయి. అంటే మతపరంగా దేశాలను విభజించినపుడు భారత్ సింగిల్ డిజిట్ గానే చూడాలి. నేపాల్ వంటి దేశం ఆ మధ్యదాకా హిందువులకు ఆలంబనగా ఉన్నా అక్కడ కూడా వామపక్ష భావజాల ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాక అక్కడా కధ మారుతోంది.

అయితే ఇక్కడో విషయం. పేరుకు ఒక్క దేశమైనా భౌగోళికంగా, జనాభా పరంగా భారత్ ముందు భాగానే ఉంది. ఇక భారత్ లో 130 కోట్ల మంది జనాభాలో అధికారిక లెక్కల ప్రకారం ఎన‌భై శాతం హిందువులుగా ఉన్నారు. అయితే అఖండ భారత్ రెండు ముక్కలు అయినపుడు కేవలం రెండు కోట్ల మంది మాత్రమే ముస్లింలు ఇండియాలో ఉండగా ఇది అధికారిక లెక్కల ప్రకారం ఇరవై కోట్లుగా ఈ రోజుకు ఉందని అంటారు.

అయితే అనధికార లెక్కలు చూస్తే ఆ జనాభా నలభై కోట్లకు చేరువ అయిందని, మరో రెండు సార్వత్రిక ఎన్నికలు జరిగితే మాత్రం దేశానికి ముస్లిం ప్రధాని వస్తాడని హిందూత్వ సంస్థలు నొక్కి చెబుతూ ఉంటాయి. దానికి కారణం దేశంలో ఉమ్మడి సివిల్ కోడ్ లేదని, ముస్లింలలో బహు భార్యత్వం, అధికంగా పిల్లలు ఉండడం వంటి కారణాల వల్ల మరో దశాబ్ద కాలం తరువాత దేశ జనాభాలో ముస్లింలు మెజారిటీగా మారుతారని హిందూత్వ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటాయి.

ఇక ఈ రోజుకు దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 11 రాష్ట్రాలలో హిందువులు మైనారిటీలో పడ్డారని కూడా వారు లెక్కలు చెబుతారు. అందువల్ల ప్రజాస్వామిక దేశమైన భారత్ లో ఓట్ల ఆధారంగా ఏలికలు వస్తారు కాబట్టి జనాభా ఎవరిది ఎక్కువగా ఉంటే వారికే దేశాన్ని ఏలే చాన్స్ దక్కుతుంది అని కూడా చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే 2029 నాటికి కానీ లేక 2034 నాటికి కానీ దేశంలో ముస్లిం ప్రధాని వస్తాడని హెచ్చరిస్తున్నారు.

దీని మీద హిందూత్వ సంస్థలు, స్వాములు చేస్తున్న హెచ్చరికలు మాత్రం ఆందోళనను పెంచేలా ఉంటున్నాయి. అదే సమయంలో భిన్నత్వంలో ఏకత్వంగా భాసిల్లుతున్న భారత్ లో మత చిచ్చుకుని పెంచే విధంగా ఉంటున్నాయని ప్రగతిశీల వాదులు అంటున్నారు. తాజాగా చూస్తే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే స్వామీజీ యతి సత్యదేవానంద్ సరస్వతి లేటెస్ట్ గా మరో పిలుపు ఇచ్చారు.

భారత్ ఇస్లామిక్ దేశంగా మారకూడదంటే హిందువులు మరింత మందిని కనాలి అన్నది ఆయన స్టేట్మెంట్ అన్న మాట. అక్కడితో ఈ స్వామీజీ ఊరుకోలేదు. ఒక కచ్చితమైన ప్రణాళిక ప్రకారం ముస్లింలు తమ జనాభా పెంచుకుంటున్నారని స్వామీజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు అనుకున్నది జరిగి మెజారిటీ సాధిస్తే భారత్ ఇస్లామిక్ దేశం అవుతుందని స్వామీజీ అంటున్నారు. అందుకే తాను హిందువులు ఎక్కువ మందిని కనాలని సలహా ఇస్తున్నాను అని ఆయన సమర్ధించుకుంటున్నారు.

ఇక ఇదే స్వామీజీ గతంలోనూ ఇలాంటి కామెంట్స్ చేసిన సంగతి గుర్తుకు తెస్తున్నారు. రానున్న దశాబ్దాల్లో భారత్ హిందువులు తక్కువగా ఉన్న దేశంగా మారకుండా ఉండాలంటే, హిందువులు మరింత మంది పిల్లల్ని కనాలని ఈ నెల మొదట్లోనూ యతి నర్సింగానంద్ ఉత్తరప్రదేశ్ లోని మధుర వేదికగా పిలుపునిచ్చారు. అంటే ఆయన ఈ మాటను తారకమంత్రంగా తాను తిరిగిన చోటల్లా ప్రచారం చేస్తున్నారు అనుకోవాలి.

ఇవన్నీ పక్కన పెడితే భారత్ నిజంగా ఇస్లామిక్ దేశం అవుతుందా. ఆ ఆలోచనకు ఎంతవరకూ కరెక్ట్ అన్న చర్చ కూడా ఉంది. ఈ దేశంలో భిన్న మతాలు ఉన్నాయి. అందరూ కలసి కట్టుగానే ఇప్పటిదాకా ఉంటున్నారు. అయితే రాజకీయాల్లోకి మతం ప్రవేశించడం వల్లనే ఇపుడు ఈ భయాలు, సందేహాలు తెస్తున్నారు అని కూడా ఒక వాదన ఉంటే ఈ రకమైన దూకుడు వల్ల కూడా కొత్త ఆలోచనలు అవతల వర్గంలో కలిగినా తప్పు లేదు అన్న మరో మాట ఉంది.

ఆ మధ్య మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ దేశానికి ఏదోనాడు ముస్లిం మహిళ ప్రధాని అవుతుందని జోస్యం చెప్పారు. తాను అది చూడాకపోయినా జరిగి తీరుతుంది అని ఆయన నొక్కి చెప్పారు. అంటే మరి మత రాజకీయాలు పీక్స్ చేరడం వల్ల, కర్నాటక‌లో హిజాబ్ వివాదాలు పెచ్చరిల్లడం వల్ల ఒవైసీ ఈ రకంగా మాట్లాడి ఉంటారని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే అఖండ భారతాన్ని తాము మరో రెండు దశాబ్దాలలోగా సాధిస్తామని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. అదే టైమ్ లో ఆరెస్సెస్ భావాలను విశ్వసించే హిందూత్వ సంస్థలు మాత్రం ఇస్లామిక్ దేశం అంటున్నాయి. మరి ఈ వైరుధ్యాలు ఏంటి అన్నదే చర్చగా ఉంది. ఓట్ల కోసం దేశంలో మతాన్ని వాడుకుంటున్నారు అన్న అపవాదు కూడా ఉంది. ఏది ఏమైనా దేశమంటే మట్టి కాదూ, మతం అంతకంటే కాదు, మనుషులు. ఆ సంగతి అంతా గుర్తు చేసుకుంటే ఈ మత రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. తప్పు ఎవరు చేసినా శిక్షించాలి.

ఎవరు మతం గురించి మాట్లాడినా తప్పు అని చెప్పే వ్యవస్థలు ఉండాలి. అన్నింటికీ మించి భారత మాతను అంతా గౌరవించాలి. ఈ దేశంలో పుట్టిన వారికి దేవుళ్ళు వారి మత విశ్వాసాల బట్టి ఉన్నా దేవత మాత్రం భారత మాత మాత్రమే కావాలి. అది జరిగిన నాడు ఈ ఆందోళలను, పిలుపులు అంతకంటే ఉండవు.