Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ కు కొత్త ప్రమాదం!

By:  Tupaki Desk   |   2 Jan 2017 10:30 PM GMT
కేసీఆర్‌ కు కొత్త ప్రమాదం!
X
సీపీఎం దిక్కుమాలిన పార్టీ, ప్ర‌జా ఉద్య‌మాలు చేసే క్ర‌మంలో ద‌బ్బునాలతో గుచ్చుతూ హింసాత్మ‌క ప‌ద్ద‌తులకుపాల్ప‌డుతుంటారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై లెఫ్ట్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఘాటుగా కూడా రియాక్ట‌వుతున్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతున్నదని, తెలంగాణ వచ్చాక ప్రజల బతుకులు మరింత దిగజారాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. కేసీఆర్‌ పాలన ఇట్లాగే కొనసాగితే డబ్బనాలు కాదని - గునపాలు పట్టాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సామాజిక న్యాయం-సమగ్ర అభివృద్దే ధ్యేయంగా సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

రాష్ట్రంలోని 93 శాతంగా ఉన్న ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ వచ్చాక మరిన్ని పెరిగాయని వీర‌భ‌ద్రం ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానమూ కేసీఆర్‌ అమలు చేయలేదని విమర్శించారు. మిషన్‌ కాకతీయతో రైతులు దావతులు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతున్నాడని, ఇప్పటికి సీపీఎం మహజనపాదయాత్ర 750 గ్రామాల్లో పర్యటించిందని ఏ ఒక్కచోటా రైతులు దావత్‌ చేసుకున్నట్టు కనిపించలేదని ఎద్దేవా చేశారు. దావత్‌ చేసుకునేది రైతులు కాదని క‌మీష‌న్లు పొందిన‌ కాంట్రాక్టర్లేనని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులు - ఆశాలు - మున్సిపల్‌ వర్కర్లకు కనీస వేతనాలు లేక దుర్బరంగా బతుకుతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సామాజికంగా రాజకీయంగా, ఆర్ధికంగా సమాన వాటారావాలన్నారు. దీనికోసమే తాము పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. ఇది సాధించేందుకు ఎర్ర జెండా పార్టీలు నీలి జెండాలు ఏకం కావాలని వీర‌భ‌ద్రం కోరారు.

గ్రామాల్లో పర్యటిస్తే ప్రజల నుంచి అనేక వినతులు వచ్చాయని ఉండేందుకు ఇళ్లేమోగాని చచ్చిపోతే బొందపెట్ట జాగ లేదంటూ కనీసం బొందకన్నా జాగలు ఇప్పించాలని ప్రజలు కోరుతున్నారని వీర‌భ‌ద్రం అన్నారు. లక్షల రుపాయలు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి కనీసం శ్మశాన వాటికల కోసం గ్రామానికి మూడెకరాలు ఇవ్వలేకపోయారా అని ప్రశ్నించారు. సామాజికంగా - భౌగోళికంగా రాష్ట్రం పరివర్తనం చేందే విధంగా మార్పు రావాలని తమ్మినేని ఆకాంక్షించారు. కానీ లుచ్చా రాజకీయాలతో మార్పు రాదని, స్వచ్చ రాజకాయాలు రావాలన్నారు. తెలంగాణ అంటేనే ఎర్ర జెండా అని బాంచెన్‌ కాల్‌మెకుతా దొర మాటలకు వ్యతిరకంగా ఉద్యమిస్తామన్నారు. ఎర్ర జెండా ఆధ్వర్యంలోనే పది లక్షల ఎకరాల భూపంపిణీ చేశామని, ఈ భూపోరాటంలో 4 వేల మంది కార్మికులు చనిపోయరని గుర్తు చేశారు. వారి ఆశయాలనే లక్ష్యంగా చేసుకుని సీపీఎం ముందుకు సాగుతున్నదన్నారు. సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా సీపీఎం ప్ర‌యాణిస్తుంద‌ని వీర‌భ‌ద్రం తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/