Begin typing your search above and press return to search.

కరోనాకు థాయ్ సర్కార్ మందు కనుక్కుందా?

By:  Tupaki Desk   |   3 Feb 2020 1:30 PM GMT
కరోనాకు థాయ్ సర్కార్ మందు కనుక్కుందా?
X
వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టే విషయంలో ప్రపంచ దేశాలు.. శాస్త్రవేత్తలు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు విపరీతమైన కసరత్తు చేస్తున్నాయి. ఎంతగా ప్రయత్నించినా.. ఫలితం లేని పరిస్థితి. భారత్ లో ఆయుర్వేదంలో ఒక మందు ఉందని చెబుతున్నా.. ప్రభుత్వ సంస్థ అయిన ఆయుష్ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించింది లేదు. ఇక.. హోమియోలో మందు ఉందని చెబుతూ.. దానికి సంబంధించిన పోస్టు ఒకటి వాట్సాప్ లలో విపరీతంగా షేర్ అవుతోంది.

ఇలాంటివేళ.. తాజాగా థాయ్ ప్రభుత్వం మాత్రం.. కరోనాకు తాము మందును కనుగున్నట్లుగా చెబుతోంది. 71 ఏళ్ల కరోనా వైరస్ బాధితుడికి సాధారణ జ్వరం.. హెచ్ ఐవీ చికిత్సకు ఉపయోగించే యాంటీ వైరల్ ఏజెంట్లు ఉన్న కాక్టెయిల్ ఇచ్చామని.. అది బాగా పని చేసినట్లుగా చెబుతున్నారు. మందు ఇచ్చిన 48 గంటల్లోనే ఫలితం కనిపించిందని.. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు సాయం చేస్తోందని థాయ్ ఆరోగ్య శాఖ ప్రకటించటం గమనార్హం.

71 ఏళ్ల రోగిలో కరోనా వైరస్ ఉన్నట్లు తేలగా.. తామిచ్చిన కాక్టెయిల్ మందు ఇచ్చిన 48 గంటల్లోనే పని చేయటం షురూ చేసిందని.. ప్రస్తుతం వైరస్ తో బాధ పడుతున్నా.. మరో పన్నెండు గంటల వ్యవధిలో మంచం మీద నుంచి లేచి నిలుచునే పరిస్థితికి వస్తాడని చెబుతున్నారు. రోగికి ఇచ్చిన మందు వివరాలు వెల్లడిస్తూ.. కాక్టెయిల్ తో పాటు.. యాంటీ హెచ్ ఐవీ డ్రగ్ లోపినావిర్.. రోటైనావిర్ అలానే.. ఫ్లై డ్రగ్ ఒసెల్టామివిర్ కలిపి పెద్ద మొత్తంలో ఇచ్చామన్నారు. అయితే.. ఇవేమీ కరోనాను నాశనం చేయలేవు కానీ.. దాని తీవ్రతను తగ్గించే వీలుందని.. అందుకు తగ్గ శక్తిని రోగికి ఇస్తాయని చెబుతున్నారు.

తాము చెబుతున్న దానికి నిదర్శనంగా ప్రయోగాత్మక పరిశోధన ఫలితాలు అధికారికంగా రావాల్సి ఉందని.. తాము మందు కనుక్కున్నామన్న మాటను నిరూపించటం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతన్నారు. థాయ్ లో ఇప్పటివరకూ కరోనా వైరస్ 19 మందికి వ్యాపించగా.. వారిలో ఎనిమిది మంది కోలుకొని ఇళ్లకు వెళ్లగా.. మరో పదకొండు మంది మాత్రం ఆసుపత్రిలోనే ఉండటం గమనార్హం. మందు ఏదైనా.. కరోనా పిశాచి మీద పోరాడే శక్తి ఉన్న మందు అయితే చాలు.. కరోనా కల్లోలం నుంచి ప్రపంచం కాస్త ఊపిరి పీల్చుకుంటుంది.