Begin typing your search above and press return to search.

ఫైవ్‌ స్టార్ టెర్ర‌ర్ క్యాంప్‌...జైషే ఉగ్ర‌వాదుల రాజ‌సం

By:  Tupaki Desk   |   27 Feb 2019 8:25 AM GMT
ఫైవ్‌ స్టార్ టెర్ర‌ర్ క్యాంప్‌...జైషే ఉగ్ర‌వాదుల రాజ‌సం
X
సువిశాలమైన హాళ్లు వసతి గృహాలు.. స్విమ్మింగ్ పూల్.. జిమ్.. ఇదేదో ఫైవ్ స్టార్ రిసార్ట్ అనుకుంటే పొరబడినట్లే.. పుల్వామా ఉగ్రదాడికి పాల్పడ్డ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన బాలాకోట్ ఉగ్ర శిబిరం హంగులివి.సుమారు ఆరెకరాల విస్తీర్ణంలో పాకిస్థాన్‌ లోని ఖైబర్ పఖ్తున్‌ ఖ్వా ఫ్రావిన్సులోని బాలాకోట్ పట్టణానికి దాదాపు 20 కి.మీ దూరంలో కున్హర్ నది ఒడ్డున అత్యంత దట్టమైన అడవుల్లో ఈ ఉగ్రస్థావరం ఉంది. జైషేకు చెందిన అతిపెద్ద శిక్షణా శిబిరం ఇదే. సుమారు 600 మందికి ఇక్కడ వసతి సదుపాయం ఉంది. జైషే మహమ్మద్ అధిపతి మసూద్ అజర్ బావమరిది అయిన యూసఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్ ఘౌరీ ఈ క్యాంప్‌ కు నేతృత్వం వహిస్తున్నాడు. ఆత్మాహుతి దాడులపై ఇక్కడ శిక్షణ అందిస్తారు. 2003-04 మధ్య దీని నిర్మాణం ప్రారంభమైంది. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్ఘాన్ మిలిటరీ అధికారులను పాకిస్థాన్ యువతకు సైనిక శిక్షణ అందించేందుకు అప్పట్లో రిక్రూట్ చేసుకున్నారు.

యుద్ధ సమయాల్లో ఎదురయ్యే పరిస్థితులపై ఉగ్రవాదులకు నేరుగా అనుభవమయ్యేలా ఈ శిబిరంలో వాస్తవిక శిక్షణ అందిస్తారని అధికారులు వెల్లడించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ భయాందోళనకు గురికాకుండా వారిని కఠినంగా తయారు చేస్తారని చెప్పారు. పాక్ ఆర్మీకి చెందిన మాజీ సైనికాధికారులే ఉగ్రవాదులకు ఇక్కడ శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. మరో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కూడా బాలాకోట్ ఉగ్ర శిబిరాన్ని వినియోగించుకుంటున్నదని వెల్లడించారు. కొత్త గా రిక్రూట్ చేసుకున్న వారికి శిక్షణ అందించేందుకు ప్రత్యేక వసతులు ఉన్నాయని తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు - పేలుడు సామగ్రిపై శిక్షణ - ఐఈడీల తయారీ - వాటిని అమర్చడం - భద్రతా బలగాల కాన్వాయ్‌ పై దాడి - ఆత్మాహుతి దాడి - దీనికోసం వాహనాలు ఎలా సమకూర్చుకోవాలి - విపత్కర పరిస్థితుల్లో ఎలా బయటపడాలి అనేదానిపై ఇక్కడ శిక్షణ ఇస్తారని వివరించారు. జైషే అధిపతి మసూద్ అజర్ బంధువులు - ఇతర కేడర్‌ కు బాలాకోట్‌ లోనే శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు.

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఫిదాయీలను, వారి శిక్షకులను పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) నుంచి బాలాకోట్ ఫైవ్ స్టార్ ఉగ్ర స్థావరానికి తరలించారు. దీంతో భారత వైమానిక దళానికి ఇది ఈజీ టార్గెట్‌ గా మారింది. వాయుసేన జరిపిన మెరుపు దాడిలో సుమారు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీరిలో 25-27 మంది శిక్షకులు - సుమారు 42 మంది సుశిక్షిత ఆత్మాహుతి దళ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. దాడుల సమయంలో వారందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు పేర్కొన్నారు. పాక్ భూభాగంలోకి వచ్చి భారత్ ఈ తరహా దాడులకు పాల్పడుతుందని పాక్ సైనిక విభాగం ఊహించలేకపోయిందని చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి పీవోకేలో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత్ లక్షితదాడులకు పాల్పడుతుందని వారు అనుకొని ఉండొచ్చని పేర్కొన్నారు. అయితే బాలాకోట్ క్యాంపునకు ఉగ్రవాదులను - వారి శిక్షకులను తరలించినట్లు భారత్‌ కు నిఘా సమాచారం అందిందని - దీంతో వాయుసేన మెరుపుదాడులకు దిగిందని వివరించారు. వెస్ట్రన్ - సెంట్రల్ కమాండ్స్‌ కు చెందిన పలు వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలు - ఇతర హెలికాప్టర్లు ఒకేసారి బయలుదేరడంతో పాక్ రక్షణ అధికారులు అయోమయంలో పడ్డారని వివరించారు. ఇవి ఎక్కడికి వెళుతున్నాయో వారు ఊహించలేకపోయారని చెప్పారు. కొన్ని విమానాలు విడిపోయి.. బాలాకోట్ ఉగ్రస్థావరంపై బాంబుల వర్షం కురిపించాయని అధికారులు తెలిపారు.