Begin typing your search above and press return to search.

హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. లేడీ డాక్టర్‌ చివరి పోస్ట్ వైరల్‌ !

By:  Tupaki Desk   |   26 July 2021 9:46 AM GMT
హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. లేడీ డాక్టర్‌ చివరి పోస్ట్ వైరల్‌ !
X
జీవితం ..ఏ సమయంలో ఎక్కడ , ఎలా మొదలౌతుందో ... ఎలా ముగుస్తుందో మనిషి తలరాతను రాసే ఆ బ్రహ్మదేవుడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అప్పటి వరకు ఎంతో హాయిగా సాగిపోతుంది అనుకుంటున్న జీవితం నిమిషాల వ్యవధిలోనే తలకిందులు కావచ్చు, అలాగే ముగిసిపోవచ్చు కూడా. ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరూ అంటూ సినిమా పాటలా , జీవితం ఎక్కడ ప్రారంభం అయ్యి , ఎక్కడ ముగుస్తుందో చెప్పలేము. అందుకే ఈ చిన్న జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాధిస్తూ, ఆనందిస్తూ ఎవ్వరినీ కష్టపెట్టకుండా మనం కష్టపడకుండా ముందుకుసాగుతుండాలి. మన పక్కనోళ్లను ఆలోచింపజేయాలి. ఈ ప్రయాణంలో ప్రాణాలు విడిచినా , మన కారణంగా కొంతమందైనా జీవితానికి నిజమైన అర్థం తెలుసుకుంటే అదో ఆత్మ సంతృప్తి. వీటి పరమార్థం ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం చాలా చిన్నది దాన్ని ప్రతీక్షణం ఆస్వాధించాలి.

ప్రస్తుతం జైపూర్ కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప ట్విట్టర్ లో చివరగా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎందుకంటే అదే ఆమె చివరి పోస్టు కాబట్టి, హిమాచల్ ప్రదేశ్ లో విరిగిపడ్డ కొండచరియలకు ఆమె బలైపోయింది. ఆమె తన జీవితపు చివరి క్షణాల వరకు జీవితాన్ని ఆస్వాధించింది, ప్రకృతి ఒడిలో కాలం గడిపింది, ప్రాణాలు విడిచింది. ఆదివారం హిమాచల్‌ ప్రదేశ్‌, కన్నౌవ్‌ జిల్లాలో సంగాల్‌ లోయలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన 9 మందిలో ఆమె కూడా ఒకరు. మధ్యాహ్నం 12.59 గంటల ప్రాంతంలో అక్కడి కొండల్లో ఉన్న ఇండియా-టిబెట్‌ బార్డర్‌ వద్ద దిగిన ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో ఆమె షేర్‌ చేశారు. 1.25 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి బస్తేరీ వద్ద సంగ్లా-చిట్కుల్‌ రోడ్డు మీద వెళుతున్న కార్లపై పడ్డాయి. ఓ కారులో ఉన్న దీప మృత్యువాతపడింది. ఓ ప్రకృతి ప్రేమికురాలి జీవితం అక్కడితో ముగిసిపోయింది. ప్రస్తుతం ఆమె చివరి ట్విటర్‌ పోస్టు వైరల్‌ గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమ షాక్‌ ను సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏదో భూకంపం సంభవించినట్లుగా భారీ బండ రాళ్లు కిందకు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్ద సంఖ్యలో రాళ్లు రోడ్డుతో పాటు పర్యాటకుల విశ్రాంతి గదులపై పడడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.