Begin typing your search above and press return to search.

విషాదం:ఫిలిప్పిన్స్‌ లో తెలుగు విద్యార్థులు మృతి!

By:  Tupaki Desk   |   7 April 2020 8:15 AM GMT
విషాదం:ఫిలిప్పిన్స్‌ లో తెలుగు విద్యార్థులు మృతి!
X
ఫిలిప్పిన్స్‌ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిలిప్పిన్స్‌ లో వైద్య విద్యని అభ్యసించడానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఫిలిప్పిన్స్‌ లోని సీఈబీయూ యూనివర్సిటీలో వీరిద్దరూ మెడిసిన్ చదువుతున్నారు. వీరిద్దరూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటున్నారు.. అయితే, కరోనా నేపథ్యంలో అక్కడ కూడా ప్రస్తుతం లాక్‌ డౌన్‌ విధించారు. లాక్ డౌన్ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌ కు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడం తో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో విద్యార్థులిద్దరు కూడా అక్కడిక్కడే చనిపోయారు.

ఇకపోతే , ఫిలప్పిన్స్‌ లో మృతి చెందిన ఆ విద్యార్థులిద్దరు కూడా అనంతపురం జిల్లాకి చెందినవారు. దీనితో అక్కడి అధికారులు ఈ విషయాన్ని సోమవారం తల్లిదండ్రులకు తెలియజేసారు. విద్యార్థుల మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. విద్యార్థుల మృతితో వారి స్వ‌గ్రామాల్లోనూ విషాదం నెల‌కొంది. అయితే , ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ఇద్దరి మృతదేహాలను సొంత ఊళ్లకు తరలించేందుకు అడ్డంకిగా మారింది. దీనితో వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

విద్యార్థుల మృతి - డెడ్‌ బాడీలను సొంత ఊళ్లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యంకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వీరు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా వైద్య విద్యకోసం ఫిలిప్పిన్స్ వెళ్లారని.. సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు కేంద్రమంత్రికి రాసిన లేఖలో చంద్రబాబు తెలిపారు. దీనిపై ఫిలిప్పిన్స్‌ లో ఇండియన్ ఎంబసీ స్పందించింది.. తగిన చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేసింది.