Begin typing your search above and press return to search.

తెలంగాణ.. ఆంధ్రా మధ్యనున్న కృష్ణా నదీ జలాల చిక్కులెక్కలేంటి?

By:  Tupaki Desk   |   4 July 2021 3:36 AM GMT
తెలంగాణ.. ఆంధ్రా మధ్యనున్న కృష్ణా నదీ జలాల చిక్కులెక్కలేంటి?
X
విడిపోయి కలిసి ఉందామన్న తెలంగాణ ఉద్యమ ప్రాథమిక నినాదం తరచూ పక్కదారి పడుతుందనే చెప్పాలి. తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. నీటికి సంబంధించి లెక్కలు తరచూ అగ్గిని రాజేస్తుంటాయి. అయితే.. అవన్నీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ క్రీడలో ఒక భాగంగా మారటం అసలు సమస్యగా చెప్పాలి. రెండు రాష్ట్రాల మధ్య ఉండే జలవివాదాల్లో అత్యధికం.. కేసీఆర్ మొండి వాదన కారణంతోనే అన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కీలకమైన చట్టంలో పేర్కొన్న అంశాలకు భిన్నంగా కేసీఆర్ అప్పుడప్పుడు తన వాదనను వినిపిస్తుంటారు.

తాజాగా కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న లొల్లికి సంబంధించిన అంశాల్ని చూస్తే.. కేసీఆర్ కోరుకున్నట్లే అన్ని ఉండాలన్న అంశమే కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు పెద్ద మనిషిగా వ్యవహరించాల్సిన కేంద్రం సైతం.. నిబంధనలకు తగ్గట్లు వ్యవహరించి ఉంటే.. సమస్యలు మొగ్గదశలోనే తుంచేయొచ్చు. కానీ.. ఎప్పటికప్పుడు నాన్చివేత ధోరణిని అనుసరించటం.. తాత్కాలిక పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయటమే తప్పించి.. స్పష్టమైన విధానాల్ని పేర్కొనకపోవటం కూడా తరచూ సమస్యలకు తెర తీస్తుందని చెప్పాలి.

జల జగడాలకు సంబంధించిన వివాదాలు రెండు రాష్ట్రాల మధ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నెల 9న హైదరాబాద్ లో త్రిసభ్య కమిటీ భేటీ జరగనుంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాదనలు విననున్నారు. ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాల వారు కృష్ణా బోర్డుకు రాసే అభ్యంతర లేఖల్ని.. ఇరు వర్గాలకు రీడైరెక్టు చేయటం మినహా ఎలాంటి చర్యలకు పూనుకోని పరిస్థితి. ఇదే.. ఈ రోజు ఇలాంటి పరిస్థితికి కారణమని చెప్పాలి.

కొద్ది రోజుల్లో జరిగే సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రస్తావించే సమస్యలు ఏమేం ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చర్చకు వచ్చే అంశాల్లో కొన్నింటిని చూస్తే..

ఏపీ లేవనెత్తే అంశాలు

- కృష్ణా జలాలు మూసీలో కలవటం తెలంగాణకు సంబంధించిన అంశం. దానికి ఏపీని బాధ్యురాలిని చేయటం సరికాదు. కృష్ణలో కలవకుండా చర్యలు చేపట్టాలి. తెలంగాణ నష్టాన్ని మేమెలా భరిస్తాం.

- కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణకు కేటాయించిన జలాల్ని ఒక నీటి సంవత్సరంలో వినియోగించకుంటే.. తర్వాతి ఏడాది వాడుకునేలా క్యారీ ఫార్వర్డ్ విధానం సరికాదు. తెలంగాణ వాదనలో తప్పుంది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్‌–8 ప్రకారం.. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయి. వాడుకోకుండా మిగిలిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంది. అయితే.. బోర్డు ఈ అంశాన్ని తేల్చకుండా నానుస్తోంది.

- తెలంగాణ చెబుతున్నట్లుగా సాగర్ ఎడుమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవు. ప్రవాహ నష్టాల్ని తేల్చేందుకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేస్తామని బోర్డు చెప్పినప్పటికీ.. రెండేళ్లు అవుతున్నా ఏమీ జరగలేదు.

- నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద అనవసరంగా విడుదల చేసిన 13.47 టీఎంసీలను మా వాటా వినియోగంలో చూపకూడదు. ఈ విషయాన్ని గతంలోనే ప్రస్తావించినా.. దీనిపై బోర్డు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణ లేవనెత్తే అంశాలు

- ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్‌ జలాలను ఎప్పుడైనా వినియోగించుకునే స్వేచ్ఛ మాకు ఉంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయాం. వాటిని 2020–21లో వినియోగించుకుంటాం.

- హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసిన్ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని చెబుతోంది. ఈ వాదన సరికాదు. దీనిపై నివేదిక ఇవ్వాలని బోర్డు కోరినా సీడబ్ల్యూసీ మాత్రం ఇవ్వలేదు.

- నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయి. ప్రవాహ నష్టాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలి. మాకు న్యాయం చేయాలి.

- నాగార్జునసాగర్‌ కుడి కాలువ కింద విడుదల చేసిన 13.47 టీఎంసీలను ఏపీ వాటాలోకి వేయాలి. ఏపీ వాదనలో అర్థం లేదు. మా వినియోగాన్ని తప్పు పట్టేలా పొరుగు రాష్ట్రం వ్యాఖ్యలు చేయటం ఏమిటి? అదెలా అనవసరం అవుతుంది?