Begin typing your search above and press return to search.

తెలంగాణ టీడీపీ ఆశ‌ల‌న్నీ వ‌దిలేసుకుందా?

By:  Tupaki Desk   |   30 March 2017 7:39 AM GMT
తెలంగాణ టీడీపీ ఆశ‌ల‌న్నీ వ‌దిలేసుకుందా?
X
తెలుగుదేశం తెలంగాణ శాఖలోని నేత‌ల ప‌రిస్థితి అయోమ‌యంగా మారిపోయిందని అంటున్నారు. ఒక‌రి వెంట ఒక‌రు అన్న‌ట్లుగా ముఖ్య నేత‌లు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరిపోవ‌డం ఇప్ప‌టికే వారిని కుంగ‌దీసింది. ఇటు క్షేత్ర‌స్థాయిలో, అటు అసెంబ్లీలో పోరాటాలు చేయ‌డం ద్వారా అయినా ఉనికిని చాటుకుందామంటే పూర్తిగా రివ‌ర్స్ అయిపోయిందంటున్నారు. అసెంబ్లీలో గ‌ళం వినిపించ‌కుండా అధికార పార్టీ గొంతు నొక్క‌డం, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డానికి పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయ‌కులు ముందుకు రాక‌పోవ‌డంతో పార్టీ ఉనికిపై తెలంగాణ తమ్ముళ్ల‌లో అనుమానాలు మొద‌ల‌య్యాయని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత ఈ చ‌ర్చ మొద‌లైంది. గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగిలారనే కారణంతో టీడీఎల్పీ నేత ఎ రేవంత్‌ రెడ్డి - ఉపనేత సండ్ర వెంకట వీరయ్యలను సమావేశాల నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. మ‌రో స‌భ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాత్రం సమావేశాల్లో కొనసాగారు. రేవంత్‌ - సండ్ర ఇతర ఎమ్మెల్యేలు ఈ విషయమై గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసు వేశారు. స్పీకర్‌ ను కలిసి సమస్యను వివరించే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యమంత్రి ససేమిరా అంటున్నారనే కారణంతో సస్పెన్షన్‌ ఎత్తివేయలేదనే వ్యాఖ్యానాలు వస్తున్నాయి. స్పీక‌ర్‌ పోడియం దగ్గరకు పోకున్నా, గట్టిగా మాట్లాడకున్నా కావాలనే సస్పెండ్‌ చేశారని, స్పీకర్‌ మధుసూదనాచారి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని-ముఖ్యమంత్రి ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అయితే పోడియం దగ్గరకు పోకుండానే, సీట్లో ఉండగానే సస్పెండ్‌ చేయడమంటే భవిష్యత్తులో టీడీపీ గొంతు అసెంబ్లీలో ఉంటుందా ? ఉండదా అన్న సందేహం కలుగుతున్నది. కేవలం మూడు రోజులు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, మిగతా అన్ని రోజులు సస్పెన్షన్‌ కు గురై టీడీఎల్పీకే పరిమితమయ్యారు. ప్రజాసమస్యలపై సభలో చర్చించే అవకాశాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు కోల్పోవ‌డంతో ప్రతిరోజూ మీడియా పాయింట్‌ కు వెళ్లి సర్కారుపైనా, స్పీకర్‌ పైనా విమర్శలు చేయడంతోనే కాలం గడపాల్సి వచ్చింది. అయితే సభలో మాట్లాడటం వేరు, బయట మాట్లాడటం వేరని అంటున్నవారు లేకపోలేదు.

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్‌ ఎస్‌ లో చేరిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలను - ప్రధాన నాయకులను టీఆర్‌ ఎస్‌ లో కలుపుకున్న ఆ పార్టీ నాయకత్వం, టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. దీంతో పార్టీ భవిష్యత్తుపై ద్వితీయ శ్రేణి నాయకత్వం బెంగపెట్టుకుంది. తాజా స‌మావేశాల్లో ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసినా పార్టీ జాతీయ నాయకత్వం స్పందించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఇక ముందు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ ఉనికికే ప్రమాదమని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో కాక‌ర్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం ఒక‌టే మార్గమ‌న లేనిప‌క్షంలో పార్టీ ఉనికికి ప్ర‌మాద‌మేన‌ని తేల్చిచెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/