Begin typing your search above and press return to search.

బాబుపై తెలంగాణ నేత‌ల కొత్త ఆశ‌

By:  Tupaki Desk   |   18 May 2016 9:52 AM GMT
బాబుపై తెలంగాణ నేత‌ల కొత్త ఆశ‌
X
రాజ్యసభ ఎన్నికల నగారా దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ నాయకుల్లో ఆశలు రేపింది. అధికార - ప్రతిపక్షాల్లోని పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఆంధ్రప్ర‌దేశ్‌ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఈ జోరు మ‌రింత వేగంగా కొన‌సాగుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కుల‌తో పాటు తెలంగాణ తెలుగుదేశం నేత‌లు సైతం అధినేత వ‌ద్ద పెద్ద‌ల స‌భ‌లో బెర్తు ద‌క్కించుకోవ‌డం కోసం చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగిస్తున్నారు.

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పార్టీ సీనియ‌ర్ నేత - పొలిట్‌ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులుకు ఆశ‌లు చిగురించాయి. ఇంతకుముందే మోత్కుపల్లికి గవర్నర్‌ పోస్టు ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం ఎంత‌కూ తేల్చకుండా నానుతున్న నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి నర్సింహులు రాజ్య‌స‌భ‌ స్థానం కోసం పట్టుబడుతున్నారని స‌మాచారం.

ఏపీ ఏర్పడిన కొత్తలో వచ్చిన ఒక్క ఖాళీని అప్పట్లో బీజేపీ నాయ‌కురాలు నిర్మలా సీతారామన్‌ కు కేటాయించారు. కొత్త రాష్ట్రం - ఆర్థిక సమస్యల కారణంగా కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో అప్పట్లో అలా వ్యవహరించారు. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణలో టీడీపీ దాదాపు కుదేలైంది. ఆపరేషన్ ఆకర్ష్‌ కు లోనై శాసనసభ్యులంతా టీఆర్‌ ఎస్‌ లో చేరిన విషయం విదితమే. దీంతో తెలంగాణలో పార్టీని కాపాడుకోవడానికి రాజ్యసభ - లేదా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని ఇటీవల తెలంగాణ నేతలు చంద్రబాబును కోరారు. రాజ్యసభ సీటును బీజేపీకి ఇచ్చే ప్ర‌తిపాద‌న లేద‌ని తాజాగా చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలంగాణ నేత‌లు పోస్టుల బ‌రిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో మోత్కుప‌ల్లి పెద్ద‌ల స‌భ కోసం ప్ర‌య‌త్నాలు షురూ చేసిన‌ట్లు స‌మాచారం. రాజ్యసభ స్థానాన్ని తెలంగాణలో మోత్కుపల్లితో పాటు మరో పొలిట్‌ బ్యూరో నేత రావుల ఆశిస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా బాబు పెద్ద‌ల స‌భ‌లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పిస్తార‌నేతెల‌గు త‌మ్ముళ్లు కొత్త ఆశ‌లు పెట్టుకోవ‌డం ఆస‌క్తికరంగా మారింది.