Begin typing your search above and press return to search.

బాబు దిగ‌జారుడులో ఇది పీక్స్ అంటున్నారే

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:46 AM GMT
బాబు దిగ‌జారుడులో ఇది పీక్స్ అంటున్నారే
X
`సీట్ల సంఖ్య ముఖ్యం కాదు టీఆర్‌ ఎస్‌ కు వ్యతిరేకంగా కూటమి కట్టడమే లక్ష్యం`` అని ప్ర‌క‌టించి..పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాల‌ను తుంగ‌లో తొక్కి మ‌రీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు దీనికి కొన‌సాగింపుగా మ‌రింత దిగ‌జారుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా త‌మ పార్టీ స్థాయిని త‌నంత తానే దిగ‌జార్చిన చంద్రబాబునాయుడు పొత్తుల్లో భాగంగా 14 సీట్లు మాత్రమే తీసుకున్నారు. టీడీపీ నేతలు దాదాపు 25 సీట్లలో పోటీ చేయాలని తొలుత భావించినా బాబు ఆదేశాలతో అంతా మిన్నకున్నారు. అయితే, నామినేషన్ల గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తున్నా ఆదివారం అర్ధరాత్రి వరకు సీట్ల పంపకాల పంచాయితీ తేలలేదు. చివరికి ఓ కొలిక్కి తెచ్చినా...అందులోనూ తెలుగుదేశం పార్టీ నేత‌ల ఆత్మాభిమానం దెబ్బ‌తీసే చ‌ర్య‌లు ఉన్నాయంటున్నారు.

కూటమి పొత్తుల్లో టీడీపీకి 14 సీట్లు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఈ 14 స్థానాల్లోనే టీడీపీకి కేటాయించిన మహబూబ్‌ నగర్ సీటులో తెలంగాణ జన సమితి అభ్యర్థిని ప్రకటించి బీ-ఫారం ఇచ్చారు. టీడీపీకి కేటాయించిన ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దించే ప్రయత్నం చేస్తున్నది. దీంతో ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామరంగారెడ్డికి చివరి నిమిషంలో పార్టీ నేతలు బీ-ఫారం ఇవ్వకుండా ఆపారు. 13 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించి వీరిలో 12 మందికి ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌ లో బీ-ఫారాలను పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి - ఎంపీ గరికపాటి మోహన్‌ రావు - పెద్దిరెడ్డి అందజేశారు. కానీ, ఇబ్రహీంపట్నం అభ్యర్థి సామరంగారెడ్డికి నిలిపి వేశారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ ను కాంగ్రెస్ నేత మల్‌ రెడ్డి రంగారెడ్డి కూడా ఆశిస్తున్నారు. మాజీ రాజ్యసభసభ్యుడు గిరీశ్‌ సంఘీతో మల్‌ రెడ్డి రంగారెడ్డి ఢిల్లీ నుంచి లాబీయింగ్ చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తాజా ప‌రిణామాలు చూస్తుంటే - 12 సీట్లకే టీడీపీ పరిమితమవుతుందా అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. టీడీపీకి కేటాయించిన 14 సీట్లలో ముందుగా 13 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ఇబ్రహీంపట్నం సీటుపై కూడా డైలమా ఏర్పడింది. మరోసీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో ఇప్పటివరకు కేటాయించిన 12 సీట్లకే టీడీపీ పరిమితమవుతుందా? అనే సందేహాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. సనత్‌ నగర్ టికెట్ తనకు గ్యారెంటీగా వస్తుందన్న ధీమాతో మర్రి శశిధర్‌ రెడ్డి ఉన్నారు. ఒకవేళ శశిధర్‌ రెడ్డికి పార్టీ బీ-ఫారం ఇస్తే ఇక్కడ టీడీపీ - కాంగ్రెస్ పార్టీలు రెండు బరిలో నిలిచే అవకాశం ఉంది. పార్టీ నాయకులు మాత్రం మిగిలిన సీట్లకు కూడా అభ్యర్థులను నిర్ణయిస్తామని ముక్తసరిగా సమాధానం ఇస్తున్నారు. ఈ సీట్లుపై టీడీపీ నేతలు క్లారిటీ ఇవ్వలేకపోవడంతో పార్టీ కార్యకర్తలు తమకు నమ్మకం పోయిందని అంటున్నారు. త‌న రాజ‌కీయాల కోసం త‌మ భ‌విష్య‌త్తును పార్టీ పెద్ద‌లు ప‌ణంగా పెట్టార‌ని పార్టీ నేత‌లు ఆరోపిస్తున్నారు.