Begin typing your search above and press return to search.

ఎవరీ తమిళ సై.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

By:  Tupaki Desk   |   1 Sep 2019 8:36 AM GMT
ఎవరీ తమిళ సై.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
X
తమిళ సై. నిన్నటి వరకూ కొద్దిమందికి మాత్రమే పరిచితమైన పేరు.. గడిచిన కొద్ది సేపట్లో తెలుగు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారటమేకాదు.. ఎవరు ఆమె? అన్న ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళ సై సౌందర రాజన్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఆమె గురించి వివరాల కోసం వెతుకులాట మొదలైంది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె.. డాక్టర్ గా పని చేసేవారు. భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమె.. బీజేపీలో చేరిన అతి కొద్ది కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. అతి తక్కువ కాలంలో బీజేపీ అగ్రశ్రేణి మహిళా నేతగా అవతరించారు. తాజాగా ఆమెకు తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అప్పజెప్పటం ద్వారా.. పార్టీలో ఆమెకున్న ప్రాధాన్యత ఏమిటన్నది ఇట్టే అర్థం కాక మానదు.

1961 జూన్ 2న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ లో జన్మించిన ఆమె మద్రాస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంజీఆర్ వైద్య విశ్వవిద్యాలయంలో గైనకాలజీ విభాగంలో పీజీ పూర్తి చేశారు. ఆ తర్వాత కెనడాలోని సోనోలజీ.. ఎఫ్ ఈటీలో థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రామచంద్ర వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసిన ఆమె.. తర్వాతి కాలంలో రాజకీయాల్లోకి వచ్చారు. పలు ఆసుపత్రుల్లో విజిటింగ్ కన్సెల్టెంట్లుగా పని చేశారు.

ఇక.. తమిళ సై తండ్రి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉండేవారు. దీంతో.. ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. మద్రాస్ లో ఎంబీబీఎస్ చదివే సమయంలోనే ఆమె విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. తండ్రి కాంగ్రెస్ లో ఉన్నా తాను మాత్రం బీజేపీ సిద్ధాంతాలపైన ఆకర్షితులయ్యారు.

బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి అనేక హోదాల్లో పార్టీకి సేవలు అందించారు. 1999లో సౌత్ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా.. 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా.. 2005లో ఆల్ ఇండియా కో- కన్వీనర్ గా.. 2007లొ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా .. 2010లొ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక.. 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె.. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేళ ఆమె తెలంగాణ గవర్నర్ గా ఎంపికై సంచలనంగా మారారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా ఖ్యాతిని తన సొంతం చేసుకున్నారు.

ఇక.. ఆమె వ్యక్తిగత వివరాల్లోకి వెళితే ఆమె భర్త సౌందర్ రాజన్ కూడా వైద్యులే. సవితా వర్సిటీలో నెఫ్రాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ గా వ్యవహరిస్తున్నారు. అపోలో ఆసుపత్రిలో నెప్రాలజిస్ట్ సీనియర్ కన్స్ ల్టెంట్ గా పని చేస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు.

తమిళ సైలో ఉన్న మరో కోణం ఏమంటే.. ఆమె మంచి వక్త. తన వాక్ చాతుర్యంతో ఎవరినైనా మెప్పిస్తారన్న పేరుంది. తనకున్న నైపుణ్యంతోవిద్యార్థులు.. పిల్లలకు స్కిల్ సెట్ పెంపొందించే కార్యక్రమాన్ని దాదాపు పదేళ్లు నిర్వహించారు. రాజ్ టీవీలో ప్రసారమైన ఆమె కార్యక్రమానికి చాలామంది పేరు ఉండటమే కాదు.. దానికి చక్కటి టీఆర్పీ రేటింగ్ కూడా ఉండటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఆమెకు ఎదురుదెబ్బలు తప్పలేదు. ఎమ్మెల్యేగా రెండుసార్లు.. ఎంపీగా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. తాను ప్రవేశించిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయిన ఆమె.. ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం వరుస ఎదురుదెబ్బలు తిన్నారని చెప్పాలి. తాజాగా గవర్నర్ గా ఎంపికై.. కొత్త ఇన్నింగ్స్ ను షురూ చేశారని చెప్పాలి.