Begin typing your search above and press return to search.

ఒక‌వైపు సుప్రీంలో విచార‌ణ మ‌రోవైపు మునుగోడులో 'ఉచితా'లు!

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:30 AM GMT
ఒక‌వైపు సుప్రీంలో విచార‌ణ మ‌రోవైపు మునుగోడులో ఉచితాలు!
X
దేశంలో ఒక‌వైపు.. రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టిపోతున్నాయ‌ని.. ఉచిత హామీలు.. ప్ర‌జ‌ల‌కు ఎన్నిక‌ల స‌మయం లో ఇచ్చే తాయిలాల‌తో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు నెత్తీనోరు కొట్టుకుంటోంది. ఉచిత హామీలు.. తాయిలాల‌పై సుప్రీం కోర్టులో విచార‌ణ కూడా జ‌రుగుతోంది. దీనిని కోర్టు చాలా సీరియ‌స్‌గా కూడా తీసుకుంది. అయితే.. ఒక‌వైపు అంత జ‌రుగు తుంటే.. మ‌రోవైపు ఇంకా.. ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేష‌న్ కూడా రాని.. మునుగోడు ఉప ఎన్నిక‌లో పార్టీలు.. ఉచిత‌హామీలు.. ఓట‌ర్ల‌కు తాయిలాలు పంచేస్తున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మునుగోడు ఉప ఎన్నికలో ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఓవైపు ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ శిబిరంలో చేర్చుకునే పనిని కొనసాగి స్తూనే.. మరోవైపు ఓటర్లకు తాయిలాలు పంపిణీని చేస్తున్నాయి.

సాధారణంగా నోటిఫికేషన్‌ వెలువడ్డాక ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చేపట్టే ఈ తాయిలాల పంపిణీని మునుగోడులో అధికార టీఆర్ఎస్‌ అప్పుడే మొదలుపెట్టిందనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నియోజకవర్గంలోని ఓటర్లకు గోడ గడియారాల పంపిణీ చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు.

చౌటుప్పల్‌ మండలంలోని టీఆర్ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షులకు ఈ గడియారాలు చేరాయని తెలిసింది. పెద్ద గ్రామాలకు 800, చిన్నగ్రామాలకు 500, మునిసిపల్‌ వార్డుకు 300 చొప్పున గోడ గడియారాలు చేరినట్లు ప్ర‌జ‌ల మ‌ధ్చ చ‌ర్చ జరుగుతోంది.

టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నవ్వుతున్న ఫొటో, దాని కింద పార్టీ గుర్తు అయిన కారు బొమ్మను ముద్రించి ఉన్న ఈ గడియారాల పంపిణీని ప్రారంభించారని కాంగ్రెస్ కూడా విమ‌ర్శ‌లు చేస్తోంది. ఈ నెల 25 లోపు వీటి పంపిణీ పూర్తి చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

మండలంలోని కోయలగూడెం గ్రామంలో పంచుతున్న గోడ గడియారాలు తీసుకునేందుకు గ్రామస్థులు నిరాకరించారు. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు సమయంలో ఈ గ్రామాన్ని రెండు భాగాలుగా విడగొట్టినందుకు నిరసనగానే వారు గడియారాలను తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. అధికార పార్టీలోని నేతల ఆధిపత్య పోరులో భాగంగా పెద్ద గ్రామమైన కోయలగూడాన్ని రెండు గ్రామాలుగా విడగొట్టి ఎల్లంబావి అనే కొత్త గ్రామ పంచాయతీని సృష్టించారు. దీన్ని కోయలగూడెం గ్రామస్థులు జీర్ణించుకోలేక పోయారు. మొత్తానికి.. ఒక‌వైపు సుప్రీం కోర్టులో తాయిలాల‌పై చ‌ర్చ‌సాగుతుండ‌గానే.. ఇప్పుడు మునుగోడులో పంపిణీ చేయ‌డం.. ఆస‌క్తిగా మారింది.