Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్ల‌పై ఎంపీ క‌విత ఘాటు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   14 April 2018 12:51 PM GMT
రిజ‌ర్వేష‌న్ల‌పై ఎంపీ క‌విత ఘాటు వ్యాఖ్య‌లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, ఎంపీ క‌విత రిజ‌ర్వేష‌న్ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ కేంద్రానికి స్ప‌స్ట‌ట‌మైన హెచ్చ‌రిక‌లు చేశారు. రాజ్యంగా నిర్మాత అంబేద్క‌ర్ ఎంతో దార్శ‌నిక‌త‌తో రాజ్యాంగాన్ని రూపొందించార‌ని క‌విత కితాబిచ్చారు. ఆనాడే ఆయ‌న రిజ‌ర్వేష‌న్ల‌ను బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేశార‌న్నారు. ప్ర‌స్తుతం వాటి విష‌యంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయ‌ని పేర్కొంటూ ఎస్సీ-ఎస్టీ చట్టంలో ఒక్క కామా, ఫుల్‌స్టాప్‌ మార్చినా ఊరుకొనేది లేదని హెచ్చ‌రించారు.

రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఇవ్వటంలో ఒక తార్కిక విధానం ఉందని, దాని గురించి అంబేద్కర్‌ అప్పుడే ఆలోచించారని ఎంపీ క‌విత తెలిపారు. రాజ్యాంగాన్ని ఆయ‌న దూర‌దృష్టితో రూపొందించార‌ని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటయిందన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. ఇటువంటి అంశాలకు రాజ్యాంగంలో వెసులుబాటు కల్పిస్తూనే పెద్దవాళ్లు చిన్న వాళ్లను ... ఉన్నవాళ్లు లేనివాళ్లను అణిచివేసే అవకాశం ఉండొద్దని సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న మైనారిటిలకు రక్షణ కల్పించాలని గొప్ప ఆలోచనలు చేసిన ఘనత అంబేద్కర్ దక్కిందన్నారు. అటువంటి మహనీయుడి ఆలోచనలను అమలు పరుస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

ఇదిలాఉండ‌గా...ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. వరంగల్ లో అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన అంబేద్కర్ 127వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం దళితుల హక్కులను కాలరాస్తోందని, దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశ పెట్టలేదని విమర్శించారు. రిజర్వేషన్లను, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కేంద్రం నీరుగారుస్తున్నారని కడియం శ్రీహరి విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పు వల్ల భారత్ బంద్ సందర్భంగా 12 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఉన్న రెండు కోరలను సుప్రీంకోర్టు పీకేసిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కోర్టుల్లో కూడా రిజర్వేషన్లు ఉండాలన్నారు. జడ్జీలు కూడా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు రాగానే దానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారని కడియం గుర్తుచేశారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన తాను అంబేద్కర్ చలువ వల్లనే డిప్యూటీ సీఎం గా మాట్లాడుతున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేయడం లేదని, ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కోరినా కావాలనే ఆలస్యం చేస్తోందని కడియం విమర్శించారు.

ఇదిలాఉండ‌గా... గులాబీ ద‌ళ‌ప‌తి త‌న‌య చేసిన వ్యాఖ్య‌ల‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ద‌ళితుల సంక్షేమ కోసం క‌విత గ‌ళం వినిపించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని పేర్కొంటూనే...అదే స‌మ‌యంలో సాక్షాత్తు ఆమె తండ్రి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకాలో ద‌ళితుల‌కు న్యాయం ద‌క్క‌క‌పోవ‌డం గురించి పలువురు ప్ర‌స్తావిస్తున్నారు. ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ హామీ ఇచ్చార‌ని అయితే...అధికారం ద‌క్కిన త‌ర్వాత ఆయ‌నే సీఎం అయ్యార‌ని పలువురు పేర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో ఉప‌ముఖ్య‌మంత్రిగా ఉన్న రాజ‌య్య‌ను అక‌స్మాత్తుగా ఆ ప‌ద‌వి నుంచి ఊడ‌బీకార‌ని గుర్తుచేసుకుంటున్నారు