Begin typing your search above and press return to search.

సూపర్ సారూ.. తెలంగాణను టాప్ ఫోర్ లెకి తీసుకొచ్చారు

By:  Tupaki Desk   |   28 Jun 2020 11:10 AM GMT
సూపర్ సారూ.. తెలంగాణను టాప్ ఫోర్ లెకి తీసుకొచ్చారు
X
దేశంలోని చాలా రాష్ట్రాల వారికి లాక్ డౌన్ అంటే ఏమిటో తెలీని వేళలోనే.. తెలంగాణలో లాక్ డౌన్ ను పరిచయం చేయటమే కాదు.. అమల్లోకి తీసుకొచ్చిన వైనం చూసినప్పుడు రాష్ట్రానికో డైనమిక్ ముఖ్యంత్రి ఉంటే ఏమవుతుందో అర్థమవుతుందన్న పొగడ్తలు వినిపించాయి. మాయదారి మహమ్మారిని అడ్డుకోవటం అంత తేలికైన విషయం కాదని.. అందుకు భారీగా మానవ వనరులతో పాటు.. నిధుల ఖర్చు కూడా అవసరమన్న విషయం నెమ్మదిగా అర్థమైంది. సుదీర్ఘకాలం పాటు సాగే పోరుతో వచ్చే ఇబ్బందుల్ని గుర్తించారో ఏమో కానీ.. అప్పటివరకూ మహమ్మారి విషయం మహా కరకుగా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చటుక్కున మారిపోయినట్లుగా కనిపిస్తోంది.

ఈ విమర్శకు బలం చేకూరేలా వరుస ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో మహమ్మారిపై చర్చల మీద చర్చలు.. రివ్యూలు చేపట్టిన స్థానే.. ఇప్పుడు పెద్దగా పట్టటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం ఒక రిపోర్టునువిడుదల చేసింది. అందులో రోజురోజుకీ నమోదవుతున్నకొత్తకేసుల లెక్కతో పాటు.. ఏయే రాష్ట్రాల్లో కేసుల నమోదు తీవ్రత ఎక్కువ ఉందన్న విషయాన్ని అర్థమయ్యేలా గ్రాఫిక్స్ ను విడుదల చేసింది కేంద్రం. అందులో అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానానికి చేరుకున్న వైనం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఆందోళనకు గురి కావాల్సిందే.

ఆ మధ్య వరకు పాజిటివ్ కేసుల్ని నియంత్రించే విషయంలో తెలంగాణ రాష్ట్ర కసరత్తు భారీగా ఉన్న వేళలో కేసుల నమోదు నామాత్రంగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా రోజుకు వెయ్యి కేసులు నమోదు కావటాన్ని చూస్తే.. తెలంగాణలో పరిస్థితి ఇప్పుడెలా ఉందన్నది అర్థమవుతుంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్రలో 65వేలతో మొదటిస్థానంలో ఉంటే.. తమిళనాడు 37 వేల ప్లస్ తో రెండో స్థానంలో నిలిచింది. ఇక.. ఢిల్లీలో ఇప్పటివరకూ 27వేల ప్లస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో ఇప్పుడు ఏడువేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో యూపీ.. గుజరాత్.. ఏపీ రాష్ట్రాలు ఉన్నాయి.

దేశంలో అతి తక్కువ యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ (866).. మణిపూర్ (682).. గోవా (667).. జార్ఖండ్ (635).. ఛత్తీస్ గఢ్ (618).. లద్దాఖ్ (587) చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఇదంతా చూసినప్పుడు భారీ ఎత్తున ఉన్న యాక్టివ్ కేసుల నుంచి బయటపడటానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుఉమ్మడిగా ఏదైనా నిర్ణయం తీసుకోవటం ద్వారా.. యాక్టివ్ కేసుల్ని తగ్గించే అవకాశం ఉందంటున్నారు.