Begin typing your search above and press return to search.

ఇది కేసీఆర్ సృష్టించిన పంచాయితీ

By:  Tupaki Desk   |   17 Aug 2016 4:51 PM IST
ఇది కేసీఆర్ సృష్టించిన పంచాయితీ
X
అవసరం లేని అంశాల్ని అనవసరంగా వివాదాలుగా మార్చుకోవటానికి ఎవరూ ఇష్టపడరు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ధోరణి ఇదే రీతిలో ఉంది. సున్నిత అంశాల విషయంలో జోక్యం చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవటం పరిపాటి. మరి.. కేసీఆర్ ఏం కసరత్తు చేశారో ఏమో కానీ.. కొద్ది రోజులుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ఐఏఎస్ అధికారులకు మంట పుట్టిస్తున్నాయి.

పలు శాఖలకు తమను కాకుండా ఐపీఎస్ లను కమిషనర్లుగా నియమించటంపై పలువురు సీనియర్ ఐఏఎస్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారన్న విషయంపై స్పష్టత లేని పరిస్థితి. ఆ మధ్యన సాంఘిక సంక్షేమ శాఖకు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ను కమిషనర్ లుగా నియమించటంపై ఐఏఎస్ అధికారులు గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ను పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎంపికపై ఐఏఎస్ అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకిలా జరుగుతుందన్న చర్చ రెండు వర్గాల్లో మొదలైంది. ఎప్పుడూ లేనిది ఈ మధ్యన ఒకరి తర్వాత మరొక ఐపీఎస్ ను శాఖలకు కమిషనర్లుగా నియమించటం.. రానున్న రోజుల్లో ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా కూడా మరో ఐపీఎస్ అధికారిని ముఖ్యమంత్రి నియమించనున్నారన్న వార్త కొత్త కలకలానికి దారి తీసింది. ఇప్పటి పరిణామాలకే ఆగ్రహంగా ఉన్న ఐఏఎస్ అధికారులు.. తాజాగా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం కోరినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ లేని విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారన్న విషయాన్ని ఆయన ముందే పంచాయితీ పెట్టాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. విధేయతతో వ్యవహరించే అధికారుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకిలా చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.