Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు షాక్..సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే

By:  Tupaki Desk   |   12 Feb 2020 2:08 PM GMT
కేసీఆర్ కు షాక్..సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే
X
వరుసపెట్టి ఎన్నికల్లో ఘన విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో నిజంగానే ఊహించని షాక్ తగిలిందనే చెప్పాలి. సచివాలయం కోసం కొత్త భవన సముదాయం నిర్మించాలని దాదాపుగా తీర్మానించేసుకుని, ఆ కొత్త భవనం నిర్మాణాన్ని ప్రారంభించకుండానే... పాత సచివాలయాన్ని కూల్చివేయాలని కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలకమైన సచివాలయ తరలింపుపై అంత తొందరెందుకు? అంటూ కేసీఆర్ స్పీడుకు బ్రేకులేసిన హైకోర్టు... అసలు కొత్త భవనానికి సంబంధించిన డిజైన్లు, పార్లను ముందుగా తన ముందు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్బంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు కాస్తంత గట్టిగానే తగిలాయన్న వాదన కూడా వినిపిస్తోంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సచివాలయం కూల్చివేత విషయంలో బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపిట్టింది. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ ను కూల్చరాదంటూ ఈ సందర్బంగా హైకోర్టు స్టే విధించింది. సరిగ్గా మూడు వారాల కిందటే కొత్త డిజైన్లు తయారుచేసుకోవచ్చని చెప్పిన కోర్టు... అంతలోనే కూల్చివేతలపై స్టే ఇవ్వడం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామంలా మారిందన్న వాదన వినిపిస్తోంది. విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై న్యాయమూర్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘భవనాల్ని కూలగొట్టడానికి మీకు(ప్రభుత్వానికి) ఎందుకంత తొందర? కొత్త సెక్రటిరేట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? కొత్త డిజైన్లు, ఆర్థిక పరమైన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందా? అసలు డిజైన్లు, డీపీఆర్ లు సిద్ధంగా ఉన్నాయా? అవి లేకుండా ఇప్పటికిప్పుడు బిల్డింగ్స్ ను కూల్చి ఏంటి ప్రయోజనం? టెక్నాలజీ ఇంతగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మీరు డిజైన్లు ఖరారు చేయలేరా?'' అంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాదిపై న్యాయమూర్తులు ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణానికి సంబంధించి డిజైన్లు, ఆర్థిక పరమైన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత, సంబంధిత రిపోర్టులను తమ ముందు ఉంచాలని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటిదాకా సచివాలయ భవనాల కూల్చివేతను చేపట్టవద్దని కూడా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసిన కోర్టు.. .ఆ లోగా కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, కేబినెట్ నిర్ణయాలను తమ ముందు ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఈ దిశగా చేసిన కీలక వ్యాఖ్యలు నిజంగానే కేసీఆర్ కు గట్టి ఎదురుదెబ్బేనని చెప్పక తప్పదు. అయితే విచారణ సందర్భంగా పాత సచివాలయ భవనాల కూల్చివేతకు అనుకూలంగానే కొన్ని వ్యాఖ్యలు న్యాయమూర్తుల నుంచి రావడంతో తమకు అనుకూలంగానే తీర్పు ఉండబోతోందని కేసీఆర్ సర్కారు భావించిన మరుక్షణమే... కూల్చివేతపై స్టే విధించడంతో పాటు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడంతో కేసీఆర్ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.