Begin typing your search above and press return to search.

కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలి... గ‌వ‌ర్న‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

By:  Tupaki Desk   |   11 March 2022 6:03 PM GMT
కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాలి... గ‌వ‌ర్న‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గురువారం నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉండ‌టంతో ఈ ఉద‌యం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించి అనంత‌రం డిశ్చార్జీ చేశారు. అయితే, సీఎం కేసీఆర్ కు ఎలాంటి సమస్యా లేదని చెప్పడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళసై ట్విట్టర్ వేదిక‌గా స్పందించారు.

కేసీఆర్ ఆరోగ్యంపై గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ చేస్తూ, సీఎం కేసీఆర్‌ ఆనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసి ఆందోళన చెందాన‌ని పేర్కొన్నారు. `` కేసీఆర్‌ గారు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన తొందరగా కోలుకోవాలి’ అని ట్విట్‌ చేశారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతుండ‌టం, ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం కేసీఆర్ అన్న‌ట్లుగా ఉన్న త‌రుణంలో గ‌వ‌ర్న‌ర్ ట్వీట్ ఆమె హుందాత‌నాన్ని చాటుతోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

కాగా, సీఎం కేసీఆర్‌ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు. కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, కూతురు కవిత, సంతోష్, హరీష్ రావు, మనవడు హిమాన్షు కూడా ఆస్పత్రికి వెళ్లారు. సీఎం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండడంతో కార్యకర్తల్లో కొంత ఆందోళన నెలకొంది. అనంత‌రం ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏవీ లేవ‌ని పేర్కొంటూ కేసీఆర్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేసీఆర్‌కు సూచించారు.