Begin typing your search above and press return to search.

'దిశ' నిందుతుల ఎన్ కౌంటర్ .. ప్రభుత్వం సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   9 Dec 2019 7:16 AM GMT
దిశ నిందుతుల ఎన్ కౌంటర్ .. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X
గత నెల 27 వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ దిశ పై నలుగురు కామాంధులు దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడి - హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే , ఆ తరువాత నిందుతులని పట్టుకొని విచారణలో భాగంగా దిశను తగులబెట్టిన ప్రదేశానికి తీసుకుని వెళ్లిన సమయంలో ఆ నలుగురు నిందితులు పోలిసుల వద్ద ఉన్న తుపాకులను లాక్కుని వారి మీద రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు ప్రాణరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

ఈ ఎన్ కౌంటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తే.. మరికొందరు తప్పుబట్టారు.. మిగతా రేప్ కేసుల్లో ఉన్న నిందితుల పరిస్థితి ఏంటి? అని ప్రశించారు. దీనితో రంగంలోకి దిగిన జాతీయ మానవహక్కుల కమిషన్ హైదరాబాద్‌ లో గత రెండు రోజులుగా విచారణ జరుపుతుంది. ఇప్పటికే నిందుతుల డెడ్ బాడీలని - ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఎన్ కౌంటర్ పై సిట్ ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో.. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. వనపర్తి ఎస్పీ అపూర్వరావు - మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి - రాచకొండ ఎస్‌ వోటీ డీసీపీ సురేందర్ - సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ - సంగారెడ్డి డీసీఆర్‌ బీ సీఐ వేణుగోపాల్ రెడ్డి సిట్‌ లో సభ్యులుగా ఉన్నారు. దిశ కేసులో నిందితుల ఎన్‌ కౌంటర్‌ పై పూర్తి విచారణ జరపాలని సిట్‌ ను ఆదేశించింది. అసలు ఘటనా స్థలంలో ఏం జరిగింది..? ఎన్‌ కౌంటర్‌ కు దారితీసిన పరిస్థితులు ఏంటి? అన్న విషయాలు తెలుసుకోవాలని తెలిపింది. అలాగే ఈ ఘటనలో పాల్గొన్న పోలీసుల వివరాలను సిట్ సేకరించనుంది. కాగా, సోమవారం ఉదయం తెలంగాణ హైకోర్టులో దిశ ఎన్‌ కౌంటర్‌ పై విచారణ ఉంది.