Begin typing your search above and press return to search.

వలసల తెలంగాణ షురూ...!?

By:  Tupaki Desk   |   13 Dec 2018 4:50 AM GMT
వలసల తెలంగాణ షురూ...!?
X
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హోరు ముగిసింది. ఊహించని ఫలితాలు అని ప్రతిపక్షాలు అంటూంటే... తాము ఈ ఫలితాలు ఊహించినవే అని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం అంటోంది. ఎవరు ఏమి అనుకున్నా తెలంగాణ ఓటర్లు మాత్రం తాము ఏం చేయదలచుకున్నరో అదే చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్షాలు ఊహించని షాకింగ్ తెలంగాణ ఎన్నికలు ఇచ్చాయి. ఇక్కడ అధికారంలోకి వస్తామని గంపెడాశలు పెట్టుకున్న ప్రజాకూటమికి నిరాశే ఎదురైంది. ఏకంగా 88 స్ధానాలతో తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఇప్పుడు అందరి ద్రష్టి వలసలపైనే మారింది. రాజకీయంగా పెనుదుమారం తీసుకువచ్చిన తెలంగాణ ముందస్తు ఎన్నికల భవిష్యత్ రాజకీయ చిత్ర పటాన్ని సరికొత్తగా ఆవిష్కరించనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో ఐదేళ్ల పాటు రాజకీయ నిరుద్యోగులుగా మనలేని కొందరు కాంగ్రెస్ - తెలుగుదేశం నాయకులు తమ భవిష్యత్ కంటే కూడా తమ వారసుల భవిష్యత్ ను ద్రష్టిలో ఉంచుకుని కారులో ప్రయాణించే అవకాశం ఉందని అంటున్నారు. భవిష్యత్ లో కోలుకోలేని దెబ్బ తీసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాచికల ముందు తాము ఏమీ చేయలేమనే నిర్ణయానికి వచ్చేశారంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితిదే సమీప భవిష్యత్ అని నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం - కాంగ్రెస్ నాయకులు కొందరు ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డిని తమ పార్టీలోకి రావాల్సిందే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావే ఆహ్వనించారు. అయితే దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధి చేతిలో జానారెడ్డి ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెస్ లో తన కుమారుడ్ని కూడా పోటీ చేయించాలని జానారెడ్డి భావించారు. అది సాధ్యం కాలేదు. రాజకీయంగా తన పని పూర్తి అయ్యిందని భావిస్తున్న జానారెడ్డి తన కుమారుడి కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఆయనతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా తమ పిల్లల భవిష్యత్ కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలనుకుంటున్నట్లు సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. దీంతో ఈ పార్టీలో మిగిలిన కొందరు నాయకులు కూడా తమ పిల్లల కోసం కారు ఎక్కే అవకాశాలున్నాయంటున్నారు. మొత్తానికి రానున్న కాలమంతా తెలంగాణలో వలసల కాలమే అని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.