Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ రథసారధి కోసం భూతద్దం పట్టుకొని మరీ తిరుగుతున్నారు

By:  Tupaki Desk   |   12 Dec 2020 6:04 AM GMT
టీ కాంగ్రెస్ రథసారధి కోసం భూతద్దం పట్టుకొని మరీ తిరుగుతున్నారు
X
దశాబ్దాల నాటి తెలంగాణ కలను నెరవేరిస్తే చాలు.. జన్మజన్మలకు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. చేతికి అధికారాన్నిఇస్తారు. దాంతో.. తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారిపోవచ్చన్న అంచనాలు వమ్ముకావటమే కాదు.. ఇప్పుడా పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. పేపర్ మీద ప్లానింగ్ కు వాస్తవానికి మధ్య అంతరం ఎంతలా ఉంటుందన్న విషయం తెలంగాణ విషయాన్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఆశించినంత ఫలితాలు రాకపోవటంతో పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్ కు టీ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పటం తెలిసిందే. ఆయన విపరీతంగా కష్టపడినట్లుగా.. శ్రమించినట్లుగా కనిపించినా తన మార్కును చూపించలేకపోవటమే కాదు.. పార్టీలో గ్రూపుల్ని మరింత పెంచారన్న పేరే ఉంది. తెలంగాణలో పార్టీకి రిపేర్ చేసేందుకు సరైన ఇంఛార్జిని నియమించే విషయంలోనూ అధినాయకత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఇటీవల మాత్రం అందుకు భిన్నంగా సరైన పని చేసింది. మాణిక్యం ఠాకూర్ ను ఎంపిక చేయటం ద్వారా మంచి నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే టీ కాంగ్రెస్ రథసారధి కుర్చీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు.. తమకు మించినోళ్లు లేరన్నట్లుగా ప్రకటనలు ఇస్తున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న వాదనను వినిపిస్తున్నారు. దీంతో.. పీసీసీ చీఫ్ ఎవరై ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. సరైన నాయకుడ్ని నియమించేందుకు వీలుగా పార్టీ పెద్ద కసరత్తే చేస్తుంది. దీని వల్ల ప్రయోజనం ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. ఏదో జరుగుతుందన్న భావనను మాత్రం కలిగేలా చేస్తున్నారు.
పార్టీకి చెందిన పలువురు నేతలతో భేటీ అవుతున్న మాణిక్యం.. పార్టీ అంతర్గత అంశాలు.. గ్రూపులకు సంబంధించిన వివరాలతో పాటు.. ఎవరి బలం ఎంతన్న విషయం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుందని చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ పదవిని రేవంత్ కు ఇస్తారన్న ప్రచారం జరిగినా.. అదంత తేలికైన విషయం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఆయనకు పోటీగా ఒక పెద్ద వర్గమే పని చేయటం.. ఆయనకు కానీ పదవిని అప్పజెబితే పార్టీకి జరిగే నష్టం ఏ రేంజ్ లో ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అందరికి ఆమోదయోగ్యమైన నేత.. కార్యకర్తల్లో కొత్త జోష్ నింపటంతో పాటు.. దూసుకొస్తున్న బీజేపీని నిలువరించి.. తెలంగాణలో తన స్థానాన్ని స్పష్టం చేసే అధినేత ఎవరై ఉంటారు? ఆ ఎంపిక ఎలా ఉంటుందన్న ఆత్రుత పలువురిలో వ్యక్తమవుతోంది. అయితే.. ఎంపిక ప్రక్రియ పక్కాగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంత కసరత్తు జరుగుతుంది సరే.. ఇంతకీ అతడెవరు? అన్న దానిపై స్పష్టత రావటం లేదు. అదే సమయంలో ఎప్పటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.