Begin typing your search above and press return to search.

పవర్ లో లేకున్నా టీ కాంగ్రెస్ నేతలు మొనగాళ్లే

By:  Tupaki Desk   |   10 May 2016 5:10 PM GMT
పవర్ లో లేకున్నా టీ కాంగ్రెస్ నేతలు మొనగాళ్లే
X
చేతిలో పవర్ లేకున్నా.. పవర్ ఉన్న ప్రభుత్వం చేయలేని పనిని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సాధించారని చెప్పాలి. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాలకు తగ్గట్లుగా మాట్లాడతారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ విమర్శలు చేస్తుంటారు. ఆయన చేసే వ్యాఖ్యలన్నీ రాజకీయాల్లో భాగమే తప్ప.. వాస్తవం మరోలా ఉంటుందన్న విషయాన్ని తాజాగా తమ చర్యలతో స్పష్టం చేశారని చెప్పాలి. నీటి కొరత దారుణంగా ఉన్న వేళ ఎగువన ఉన్న మొండి కర్ణాటకను ఒప్పించి.. ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించుకునేందుకు ఓకే చెప్పింటం అంత తేలికైన విషయం కాదు.

ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో తమ వద్దనున్న నీటిలో ఒక టీఎంసీ నీటిని తెలంగాణకు విడుదల చేస్తామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాజాగా ఆర్డీఎస్ ప్రాజెక్టు అంశం మీద మాట్లాడేందుకు కర్ణాటక సీఎంతో భేటీ అయ్యేందుకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు తాము అనుకున్నట్లే.. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు చేత ఒక టీఎంసీ నీటిని తెలంగాణకు ఇప్పించే విషయంలో తాము అనుకున్నది సాధించినట్లు చెబుతున్నారు.

పవర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్ర సర్కారు కర్ణాటక రాష్ట్ర సర్కారుతో చర్చలు జరిపి.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను తెచ్చుకోవటంలో విఫలమైనా.. అందుకు భిన్నంగా విపక్షంలో ఉండి సైతం కర్ణాటక నుంచి తెలంగాణకు ఒక టీఎంసీ నీటిని తెచ్చిన తీరు చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మొనగాళ్ల అనకుండా ఉండలేం. గతంలో మాదిరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ అండ్ కో ఇష్టారాజ్యంగా మాట అనే అవకాశం లేదనే చెప్పాలి.