Begin typing your search above and press return to search.

పొత్తుంటే స‌త్య‌హ‌రిశ్చంద్రుడు.. లేక‌పోతే దోషి!

By:  Tupaki Desk   |   27 Dec 2017 4:16 AM GMT
పొత్తుంటే స‌త్య‌హ‌రిశ్చంద్రుడు.. లేక‌పోతే దోషి!
X
బీహార్ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఇంకా చెప్పాలంటే... మాజీ ముఖ్య‌మంత్రి - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన జోస్యం ఫ‌లించింది. దాణా కుంభ‌కోణం కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే. 1991-96 మ‌ధ్య లాలూ ప్రసాద్ యాద‌వ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో దాణా కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్పట్లో బీహార్‌ లో దాణా కోసం మొత్తం రూ.900 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్ యాద‌వ్‌ను దోషిగా ప్రక‌టిస్తూ కోర్టు తుది తీర్పు వెల్లడించిది.

దాణా కుంభకోణంలో లాలూను సీబీఐ కోర్టు దోషిగా తేల్చడం...దీంతో లాలూ జైలుకు వెళ్లడం.. జ‌రిగింది. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆయన కుమారుడు - బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన మండిపడ్డారు. లాలూను జైలుకు పంపడం ద్వారా ఆయనను రాజకీయంగా సమాధి చేశామని బీజేపీ స‌హా ఇత‌ర పార్టీలు భావిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు. బీజేపీతో తన తండ్రి చేతులు కలిపి ఉంటే వారికి ఆయన సత్య హరిశ్చంద్రుడిలా కనిపించేవారని తేజస్వి అన్నారు. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని - హైకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని తేజస్వి వెల్లడించారు. ఈ సంద‌ర్భంగా ఇదే కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా మరి కొందరిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడం పట్ల ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. కాగా, త‌ను జైలుకు వెళితే...తేజ‌స్వి రాజ‌కీయాల్లోకి వస్తార‌ని...త‌న వార‌సుడిగా ఉంటార‌ని లాలూ ప్ర‌క‌టించారు. అయితే తీర్పు విడుద‌లకు ముందే లాలూ ఈ కామెంట్లు చేశారు. లాలూ జోస్యం ఫ‌లించి..ఆయ‌న జైలుకు వెళ్ల‌డం తేజ‌స్వి రాజకీయ అరంగేట్రం జ‌రిగిపోయింది.

ఇదిలాఉండగా.... 1991 నుంచి 1996 మధ్య ట్రెజరీ నుంచి పశుదాణా కోసం అక్రమంగా రూ.86 లక్షలు విత్‌ డ్రా చేసినట్లు సీబీఐ కోర్ట్ తేల్చింది. ఈ కేసులోనే సుదీర్ఘంగా వాద‌న‌లు జ‌రిగాయి. దాణా సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ, లేని కంపెనీలను సృష్టించి వాటి పేరుతో డబ్బులు డ్రా చేశారని కోర్టు తేల్చింది. దీంతో దాణా స్కాంకేసులో సీబీఐ స్పెషల్ కోర్టు తుది తీర్పు వెల్లడిస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ కేసుపై నేడు సీబీఐ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. అయితే బిహార్‌ మరో మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా ను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను కోర్టులోనే అరెస్ట్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. రాంచీ జైలుకు ఆయన్ను తరలించారు. కాగా జనవరి 3న లాలూకు శిక్ష ఖరారు చేయనున్నారు.