Begin typing your search above and press return to search.

జనసేన ప్రోగ్రామ్ కు టీడీపీ స్పాన్సర్స్.. ఒక్కోరికి రూ. 250?

By:  Tupaki Desk   |   4 Nov 2019 9:43 AM GMT
జనసేన ప్రోగ్రామ్ కు టీడీపీ స్పాన్సర్స్.. ఒక్కోరికి రూ. 250?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన లాంగ్ మార్చ్ కు ప్రధాన స్పాన్సర్ తెలుగుదేశం పార్టీనే అనే మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. ఒక ప్రోగ్రామ్ ను నిర్వహించే శక్తి సామర్థ్యాలు జనసేనకు లేవు. ఏదో ఎన్నికల వేళ అయితే నడిపించారు కానీ, ఇలాంటి సమయంలో అదంత తేలిక కాదు ఎవరికైనా.

అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం అలాంటి వ్యవహారాలు కొట్టిన పిండి. ప్రతిదానికీ ఒక రేటు కట్టడం తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభం అయ్యింది. అయితే ఇప్పుడు తన కార్యక్రమాలను నిర్వహించుకోవడమే కాకుండా పవన్ కల్యాణ్ కు కూడా స్పాన్సర్ గా మారిందని టాక్ వినిపిస్తోంది.

ఈ విషయాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. విశాఖలో జరిగిన జనసేన లాంగ్ మార్చ్ కు టీడీపీ భారీగా ఖర్చు చేసిందని, అందుకు జనాల తరలింపు బాధ్యతను కూడా టీడీపీనే తీసుకుందని వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు.

పవన్ ప్రోగ్రామ్ కు హాజరయిన ప్రతి ఒక్కరికీ తలకు రెండు వందల యాభై రూపాయల చెప్పున తెలుగుదేశం పార్టీ పంచిందని ఆ ఎమ్మెల్యే ఆరోపించడం గమనార్హం.

ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు ఈ సభా నిర్వహణ, జనసమీకరణ, జనాలకు నోటు పంచే ఏర్పాట్లను చేసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి జనసేన సభకు జన సమీకరణకు తెలుగుదేశం పార్టీ చాలానే శ్రద్ధ చూపినట్టుగా ఉందని పరిశీలకులు కూడా అంటున్నారు.