Begin typing your search above and press return to search.

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రాలేదు ద‌స‌రా చేసుకోలేదు

By:  Tupaki Desk   |   3 Oct 2017 5:27 PM GMT
గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రాలేదు ద‌స‌రా చేసుకోలేదు
X
దాదాపు రెండేళ్లుగా ఊరింపుల్లోనే ఉండి... ఇప్ప‌టికీ నిరాశ‌లో కొన‌సాగుతున్న గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి విష‌యంలో...తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం ఎంత‌గా ఆశ‌ప‌డింది..అది ద‌క్క‌క‌పోతే ఎంత ఆవేద‌న చెందింది ఓ మీడియా ఛాన‌ల్‌ కు ఆయ‌న‌ వెల్ల‌డించారు. గవర్నర్ పదవి రానందుకు తీవ్ర నిరాశలో ఉన్నాన‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పదవి ఆశించి భంగపడ్డాన‌ని వాపోయారు.

విజయదశమి రోజు గవర్నర్ల నియామకం జర‌గ‌డం... ఆ జాబితాలో త‌న పేరు లేకపోవడంతో దసరా పండుగ చేసుకోలేదని మోత్కుప‌ల్లి స‌ద‌రు మీడియా సంస్థ‌తో వాపోయారు. త‌న కుటుంబం మొత్తం కన్నీటి పర్యంతమయిందని మోత్కుప‌ల్లి వెల్ల‌డించారు. దళితబిడ్డని అయిన త‌నకు గవర్నర్ పదవి ఇప్పించేందుకు బాస్ చంద్ర‌బాబు ఎంతో ట్రై చేశారని మోత్కుప‌ల్లి తెలిపారు. త‌నను మంచి పొజిషన్ లో చూడాలని కోరుకున్న ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్యకు ధన్యవాదాలు చెప్తున్న‌ట్లు మోత్కుప‌ల్లి వివ‌రించారు. టీడీపీ అధినేత చంద్రబాబు త‌నకు రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. రాజ్యసభ పదవి అయినా వస్తుందని ఆశిస్తున్నాన‌ని మోత్కుప‌ల్లి త‌న న‌మ్మ‌కాన్ని వెల్లిబుచ్చారు. త‌న‌ భవిష్యత్తును చంద్రబాబు నిర్ణ‌యిస్తార‌ని మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.

2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని మోత్కుప‌ల్లి ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. తెలంగాణలో టీడీపీ పార్టీ సపోర్ట్ చేయనిదే ఏ పార్టీ అధికారంలోకి రాదని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు. అవసరమైతే టీఆర్ ఎస్‌ లేదా బీజేపీకి సపోర్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.