Begin typing your search above and press return to search.

రేవంత్ దారిలోనే..ఇంకో సీనియ‌ర్ టీడీపీకి గుడ్ బై

By:  Tupaki Desk   |   18 Oct 2017 8:11 AM GMT
రేవంత్ దారిలోనే..ఇంకో సీనియ‌ర్ టీడీపీకి గుడ్ బై
X
ఇప్ప‌టికే రాష్ట్ర విజ‌భ‌న ఉద్య‌మ స‌మ‌యం నుంచి క‌ష్ట‌కాలంలో ప‌డిపోయి..కోలుకునే చాన్స్ కనిపించ‌క‌...దిగాలు ప‌డిపోతున్న‌తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత‌లకు ఇంకో దుర్వార్త వినిపిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ లోకి చేరాల‌ని డిసైడ‌యిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు తెగ నారాజ్ అయిపోతున్నారు. దీనికి కొన‌సాగింపుగా మ‌రో ప‌రిణామం చోటుచేసుకునే చాన్స్ క‌నిపిస్తోంది. టీటీడీపీ సీనియర్‌ నేత - ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి - మాజీమంత్రి ఇనగాల పెద్దిరెడ్డి ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన భాజపా జాతీయ స్థాయి నేతలతో మంతనాలు జరిపారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో టీటీడీపీకి దెబ్బ మీద దెబ్బ ఖాయ‌మ‌ని అంటున్నారు.

టీటీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న పెద్దిరెడ్డిది సుదీర్ఘ రాజ‌కీయ జీవితం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి ఆయన తెదేపా తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దిరెడ్డి కరీంనగర్‌ లోక్‌ సభకు భాజపా తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఇదివరకే పెద్దిరెడ్డి ఒకసారి తెదేపాను వీడి దేవేందర్‌ గౌడ్‌ నేతృత్వంలో తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తిరిగి దేవేందర్‌ గౌడ్‌ తెదేపాలో చేరిన సమయంలోనే పెద్దిరెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో పార్టీతీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి తెదేపాలో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి ఆయన పార్టీ బాధ్యులుగా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో పెద్దిరెడ్డికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇటీవలె ఆయన తన షష్టిపూర్తిని కూడా పూర్తిచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంస్థ తెలంగాణ ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సిల్‌ తరఫున ఆయన ఎన్నో సంస్థలకు గౌరవ అధ్యక్షుడిగా పనిచేసి కార్మికుల హక్కుల సాధనకు పోరాడారు. ప‌లు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుబంధ సంఘంపై కూడా గెలుపొందారు.

తెలంగాణ టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి కూడా ఆయనకు పిలుపు వచ్చినప్పటికీ భాజపాలో చేరేందుకే మొగ్గు చూపుతు న్నారని సమాచారం. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పెద్దిరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నప్పటి కీ ఈ నియోజకవర్గంపై ఇప్పటికే భాజపా సీనియర్‌ నేతలు మురళీధర్‌ రావు - గుజ్జుల రామకృష్ణారెడ్డి కన్నేశారు. అయితే అమిత్‌ షాతో సంప్రదింపుల అనంతరం తెదేపాను వీడేది - లేనిది నిర్ణయించుకుంటామని పెద్దిరెడ్డి తన అనుచరులకు చెప్పినట్టు సమాచారం. పెద్దిరెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆయన అనుచరులు తెదేపాను వీడుతారన్న ప్రచారం ఉంది.