Begin typing your search above and press return to search.

ఏపీలో టీడీపీ ఆఫీసు తగలబెట్టారు...

By:  Tupaki Desk   |   11 Aug 2019 8:17 AM GMT
ఏపీలో టీడీపీ ఆఫీసు తగలబెట్టారు...
X
ఎందుకో గుంటూరు సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసులకు కాలం కలిసిరావట్లేదు. సత్తెనపల్లిలో రెండు తెలుగుదేశం ఆఫీసులు ఉన్నాయి. ఒకటి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ది కాగా - మరొకటి పార్టీ ఆఫీసు. పాత ఆఫీస్ ముందు నుంచి ఉంది. అక్క‌డ ఎవ‌రు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆ ఆఫీస్ నుంచే పార్టీ కార్య‌క‌లాపాలు కొన‌సాగేవి. అయితే కోడెల ఎమ్మెల్యే అయ్యాక త‌న క్యాంప్ ఆఫీస్‌ నే పార్టీ ఆఫీస్‌ గా మార్చేశారు. ఆయ‌న మార్చారు అన‌డం కంటే ఆయ‌న త‌న‌యుడు కోడెల శివ‌రాం ప్ర‌సాద్ పాత నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టే - పాత ఆఫీస్‌ ను ప‌క్క‌న పెట్టించేశారు.

అయితే ఎన్నికల సమయంలో కోడెలకి టికెట్ ఇవ్వకూడదని కోడెల వ్యతిరేక వర్గం పార్టీ ఆఫీసుల్లో ఆందోళనలు చేశారు. అలాగే అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసేసి కుర్చీల‌ను ఇరగ్గొట్టేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాక నియోజకవర్గానికి కోడెల నాయకత్వం వద్దు అంటూ కొందరు నేతలు పార్టీ ఆఫీసుల్లో మీటింగులు పెట్టారు. కోడెల వర్గం ఏమో వారి ఆఫీసులో - వ్యతిరేక వర్గం ఏమో పాత పార్టీ ఆఫీసులో మీటింగులు పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సత్తెనపల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఒక ఆఫీసుని గుర్తు తెలియని దుండగులు కొందరు తగలబెట్టారు.

స‌త్తెన‌ప‌ల్లి మండ‌లంలోని క‌ట్ట‌మూరులో టీడీపీ ఆఫీస్ పాక్షికంగా దెబ్బ‌తింది. అయితే ఈ పని చేసింది అపోజిషన్ పార్టీ వాళ్ళా - లేక సొంత పార్టీ నేతలా అనేది తెలియాల్సి ఉంది. మామూలుగా టీడీపీ-వైసీపీలు వైరి పక్షాలుగా ఉన్నాయి కాబట్టి ఈ పని వైసీపీ వాళ్లే చేసేవారు అనుకోవచ్చు. కానీ సత్తెనపల్లి టీడీపీలోనే రెండు శత్రు పక్షాలు ఉండటంతో వారిలో వారే ఈ పని చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయి. కోడెల వర్గం - కోడెల వ్యతిరేక వర్గమో ఈ పని చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఆఫీసు తగలబెట్టడంపై స్థానిక టీడీపీ నేతలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఈ విచారణలో ఎవరు నిందితులుగా తేలుతారో చూడాలి.