Begin typing your search above and press return to search.

బుల్లెట్ రైలు వేస్టన్న టీడీపీ ఎంపీ

By:  Tupaki Desk   |   16 Dec 2015 9:12 AM GMT
బుల్లెట్ రైలు వేస్టన్న టీడీపీ ఎంపీ
X
ఆయన మాట్లాడడం తక్కువే.. కానీ, మాట్లాడితే వివాదమే. అలా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతారా అంటే అదీ కాదు, అందులో వాస్తవాలు కనిపిస్తుంటాయి, అంగీకరించేందుకు ఎవరికీ ధైర్యం చాలదు. అన్నే దేశానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతుంటారు. అందుకే ఆయన నోరు విప్పితే నేషనల్ మీడియా అలర్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయాలపై ఆయన పెద్దగా ఏమీ మాట్లాడరు. కేంద్రం నిర్ణయాలు మాట్లాడి వివాదాస్పదమవుతుంటారు.

కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగాఉన్న టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు మరోమారు భారీ కామెంట్ చేశారు. దేశంలో కోట్లాది మంది దారిద్ర్యరేఖకు దిగువన బతుకులీడుస్తుంటూ కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులను చేపట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ఈ రోజు లోక్ సభలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అనుబంధ చర్చలో పాల్గొన్న ఆయన ప్రస్తుత పరిస్థితులలో బుల్లెట్ ట్రెయిన్ వంటి ప్రాజెక్టులు చేపట్టడం సరైనది కాదని పేర్కొన్నారు. అంతేకాదు... అదేమీ ఇప్పుడు అవసరం లేదని కుండ బద్ధలు కొట్టేశారు. గతంలోనూ ఆయన సైనికులపై కామెంట్లు చేసి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిత్రపక్షంగా ఉంటూ కేంద్రాన్ని చెండాడేశారు. అంతేకాదు... దేశ అభివృద్ధిలో కీలక మలుపుగా పేర్కొంటున్న తొట్టతొలి బుల్లెట్ ట్రైన్ నెట్ వర్క్ పై కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు కూడా ఏమీ అననప్పటికీ టీడీపీ ఎంపీ మండిపడడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కాగా ఎపి రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని, మెట్రో రైల్ తదితర ఆదునాతన ప్రాజెక్టులను ఎపికి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచు చెబుతుంటే, ఆయన పార్టీ ఎమ్.పి రవీంద్ర బాబు లోక్ సభలో బుల్లెట్ రైలు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మాట్లాడడం విశేషం. కోట్ల మంది పేదలను గాలికొదిలేసి బుల్లెట్ రైలు అంటూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. రక్షణ శాఖ కు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం కన్నా, నిరాయుధీకరణ వైపు అన్ని దేశాలు నడవాలని తద్వారా లక్షల కోట్ల రూపాయలను ఆయుదాలపై వెచ్చించే పరిస్థితి ఉండదని, దానిని పేదలకు ఉపయోగించవచచని రవీంద్ర బాబు అన్నారు. రవీంద్రబాబు సూచనల్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉన్నా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రక్షణ వ్యయం పెంచడం తప్పనిసరన్నది తెలిసిందే. అయితే.... సమాజం పట్ల రవీంద్రబాబుకు ఉన్న లోతైన అవగాహన, స్పందన మాత్రం అభినందనీయమే.

ప్రత్యేక హోదా, నిధులు వంటి విషయాల్లో కేంద్రం మొండిచేయి చూపిస్తున్నా కేంద్రంలోని టీడీపీ మంత్రులు కానీ, చంద్రబాబు కానీ ఏమీ అనలేకపోతున్న తరుణంలో నిష్కర్షగా అభిప్రాయం వెలిబుచ్చిన ఆ పార్టీ ఎంపీని చాలామంది మెచ్చుకుంటున్నారు. మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడంలో ఆయన చూపిన ధైర్యం అందరూ చూపిస్తే ప్రధాని దిగొచ్చి ఏపీకి న్యాయం చేస్తారని అంటున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక హోదా పోరుకు ఆయన్నే ముందుంచడం బెటరంటున్నారు.