Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ - కేసీఆర్ లను పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   24 Feb 2019 7:56 AM GMT
ఎన్టీఆర్ - కేసీఆర్ లను పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే
X
టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ పై చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ కేటాయింపులపై సండ్ర తనదైన శైలిలో విశ్లేషించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. మూడు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన స్వర్గీయ నందమూరి తారకరామారావుతో పోల్చి సంచలన కామెంట్స్ చేశారు.

వెంకట వీరయ్య మాట్లాడుతూ ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమంతోపాటు అభివృద్ధి విషయంలో నిర్మాణాత్మకంగా కృషి చేసి నిస్వార్థంగా సేవ చేసిన ముఖ్యమంత్రిగా దివంగత ఎన్టీఆర్ ముందుంటారని.. మళ్లీ ఇన్నాళ్లకు అంతకుమించిన సంస్కరణలతో కేసీఆర్ అంకితభావంతో పనిచేస్తున్నారని’ కొనియాడారు.

తెలంగాణలో అణగారిన ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి కేసీఆర్ తీసుకున్న చర్యలు భేష్ అంటూ సండ్ర ప్రశంసించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల కోసం గురుకులాలు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరు ఏ ముఖ్యమంత్రి చేయలేదని కొనియాడు.

నాడు ఎన్టీఆర్ తెలంగాణలో వేళ్లూనుకున్న పటేల్ , పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థలను ఏర్పాటు చేసి గొప్ప సంస్కరణ చేస్తే.. నేడు కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అంతే సంస్కరణలు తెచ్చి జనాలకు పాలనను చేరువు చేశాడని సండ్ర వెంకటవీరయ్య ప్రశంసించాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ ను తలదన్నేలా కేసీఆర్ కనిపిస్తున్నాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

పనిలో పనిగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, పక్కనే ఉన్న అశ్వరావుపేటను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని.. జిల్లా కేంద్రం ఖమ్మానికి దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వానికి విన్నవించారు.