Begin typing your search above and press return to search.

అందరు ఎమ్మెల్యేల‌ ఆతిథ్యం స్వీక‌రిస్తా....ప‌వ‌న్!

By:  Tupaki Desk   |   29 Jan 2018 10:28 AM GMT
అందరు ఎమ్మెల్యేల‌ ఆతిథ్యం స్వీక‌రిస్తా....ప‌వ‌న్!
X

జ‌న‌సేన అధ్య‌క్షుడు - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అనంత‌పురంలో ప‌ర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న "కరువు పర్యటన`` సంద‌ర్భంగా పరిటాల సునీత ఇంటికి ఫోన్ చేసి మ‌రీ ప‌వ‌న్ వెళ్లార‌ని సునీత స్వ‌యంగా ఓ మీడియా చానెల్ తో అన్నారు. దీంతో, ప‌వ‌న్ కు మంచి ఆతిథ్యం ఇచ్చేందుకు సునీత చ‌క‌చ‌కా ఏర్పాట్లు కూడా చేశారు. త‌న సోద‌రుడు(ఆ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ ను సునీత సోదరుడు అని సంబోధించారు) ప‌వ‌న్ క‌ల్యాణ్ రాక రాక ఇంటికి రావ‌డంతో మంత్రిగారు రాయ‌ల సీమ రుచులను ప్ర‌త్యేకంగా త‌యారు చేయించారు. ఆ హాస్పిటాలిటీని ప‌వ‌న్ కూడా ఆస్వాదింనిన‌ట్లుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రి ఇళ్ల‌కు వెళ్ల‌ని ప‌వ‌న్.....సునీత ఇంటికి రావ‌డంతో...మిగ‌తా టీడీపీ ఎమ్మెల్యేలు ప‌వ‌న్ కు ఆహ్వాన ప‌త్రాలు పంపేస్తున్నార‌ట‌. దీనికి ప‌వ‌న్ కూడా సానుకూలంగా స్పందించి వ‌స్తాన‌ని హామీ ఇచ్చేశార‌ట‌. రావ‌డం కొంచెం లేట్ అవుతుందేమో కానీ....రావ‌డం మాత్రం ప‌క్కా అని భ‌రోసా ఇచ్చార‌ట‌.

త‌న మిత్ర‌పక్షానికి చెందిన ఎమ్మెల్యే మిత్రులు అంతా మూకుమ్మ‌డిగా ఆహ్వానాలు పంపేస‌రికి ప‌వ‌న్ ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడ‌ట‌. ఎవ‌రూ నిరుత్సాహ ప‌డ‌వ‌ద్ద‌ని - మిగతా వారి ఇళ్ల‌కు కూడా త్వ‌ర‌లోనే వ‌స్తాన‌ని అందరి ఇళ్లల్లో విందు ఆర‌గిస్తాన‌ని భ‌రోసా ఇచ్చార‌ట జ‌న‌సేనాని. త‌న‌కు కూడా అంద‌రి ఇళ్ల‌ల్లో ఆతిథ్యం స్వీకరించాలని ఉంద‌ని, కాకుంటే కరువు సమస్యలు - ప్రజా స‌మ‌స్య‌లపై ఫోక‌స్ చేయాల‌ని చెప్పార‌ట‌. త‌న‌కు తిండి తినడం కంటే సమస్యలకు పరిష్కారమే ముఖ్యమ‌ని చెప్పార‌ట‌. అనంతపురానికి తరుచూ వస్తాన‌ని కూడా ప్ర‌క‌టించేశారట‌. రాబోయే ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి పోటీ చేయ‌బోతోన్న ప‌వ‌న్ ....అక్క‌డి ప్ర‌జ‌ల‌కు - ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ఇప్ప‌టినుంచే స‌న్నాహాలు మొద‌లెట్టేశారు. ధ‌ర్మ‌వ‌రం చేనేత కార్మికుల స‌భలో కూడా సీమ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తాను, త‌న‌సేన జ‌న‌సేన త‌ప్ప‌క ప్ర‌య‌త్నిస్తుంద‌ని నొక్కి వ‌క్కాణించారు ప‌వ‌న్. అవ‌స‌ర‌మైతే కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెళ్దామ‌ని భ‌రోసా కూడా ఇచ్చారు. ప‌వ‌న్.... త‌న స‌మ‌స్య‌ల‌తో పాటు...ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎంత‌వ‌ర‌కు ప‌రిష్క‌రిస్తారో వేచి చూడాల్సిందే.