Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ సౌత్ కు అన్యాయం..ఏపీయే ఉదాహ‌ర‌ణ‌

By:  Tupaki Desk   |   2 Feb 2017 9:22 AM GMT
మ‌ళ్లీ సౌత్ కు అన్యాయం..ఏపీయే ఉదాహ‌ర‌ణ‌
X
ప‌వ‌న్ క‌ళ్యాణ్ రైజ్ చేసిన ఉత్త‌రాది వివ‌క్ష పార్ల‌మెంటు సాక్షిగా మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. బ‌డ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూప‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నంగా నిలిచింది. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ, రైల్వే బడ్జెట్‌ లో ఏపీకి చిల్లర పైసలు మాత్రమే రాల్చారు. కేవలం అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్‌ ఇవ్వడం మినహా ఏపీ చెప్పుకోదగ్గ అంశం ఒకటి కూడా లేదు. విశాఖ రైల్వే జోన్‌ ఊసే లేదు.

చంద్రబాబు పొద్దున లేస్తే రెవెన్యూ లోటు అంటూ ఎంత‌గా మొర‌పెట్టుకుంటున్నాకేంద్రం ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. గత సొమ్ముకు లెక్కలు చెప్పకపోవడంతో అమరావతి నిర్మాణం సంగతిని కూడా కేంద్రం పక్కన పడేసింది. ప్రత్యేక ప్యాకేజ్ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు జైట్లీ. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క టీడీపీ ఎంపీగానీ నోరు మెదపలేదు. క్యాపిటల్ గెయిన్‌ మినహాయింపు ప్రకటించినప్పుడు మాత్రం బల్లలు చరిచి సంతృప్తి పొందారు.

గతంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఉన్న‌ప్పుడు బడ్జెట్‌ అయిపోగానే బయటకు వచ్చి విమర్శలు చేసే టీడీపీ ఎంపీలు ఇప్పుడు వెంటనే స్పందించేందుకు కూడా సాహసం చేయలేకపోయారు. మొత్తం మీద అరుణ్ జైట్లీ బడ్జెట్‌ లో ఏపీకి సంబంధించి చంద్రబాబు అండ్ టీం డబ్బా కొట్టుకోవడం కోసం అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్ మాత్రమే మిగిలింది. గతంలో కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా కేంద్రం సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రకటించినప్పుడు కాంగ్రెస్‌ ఎంపీలను చంద్రబాబు అండ్ బ్యాచ్ ఏకిప‌డేసేది.. ఇప్పుడు అదే నేతలు ఎంపీలు, కేంద్ర మంత్రులు అయ్యి బ‌డ్జెట్లో ఏపీకి ఇంత అన్యాయం జ‌రిగినా కిమ్మ‌న‌కుండా ఉన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/