Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు బెత్తం ప‌ట్టాల్సిందేనా?

By:  Tupaki Desk   |   13 Sep 2016 7:30 PM GMT
చంద్ర‌బాబు బెత్తం ప‌ట్టాల్సిందేనా?
X
టీడీపీ కాస్త కాంగ్రెస్ పార్టీలా మారుతోంది. క్రమశిక్షణకు మారుపేరయిన టీడీపీలో కొద్దికాలంగా అది కరవయిపోతోంది. కీలక అంశాలపై పార్టీ అధినేత - ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను సీనియర్లే ధిక్కరిస్తున్నాఉ. కేంద్రమంత్రులు - రాష్ట్ర మంత్రులు - సీనియర్లు ఒకే అంశంపై పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరుకునపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ కు అత్యంత కీలకమైన ప్రత్యేక ప్యాకేజీ అంశంపై అధికారపార్టీలోనే భిన్న స్వరాలు వినిపించడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్యాకేజీ అద్భుతమని - దాన్ని స్వాగతిస్తున్నామని స్వయంగా పార్టీ అధినేత - ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీడియా సమక్షంలోనే ప్రకటించారు. హోదా సాధించిన రాష్ట్రాలకు ఏం ఒరిగిందంటూ విధానమండలిలో కూడా మాట్లాడారు. పార్టీ నేతలను కూడా ప్యాకేజీని జనంలోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఆ తర్వాత కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో భాగస్వామిగా ఉన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా, ఇంతకంటే మంచి ప్యాకేజీ దొరకదని - ఇది రాష్ట్రానికి లాభదాయకమని - సెంటిమెంటు-ఎకనామిక్స్ వేర్వేరని స్పష్టం చేశారు. దీన్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. అయితే, పార్టీలో సీనియర్ నేత - ఎమ్మెల్సీ అయిన మాజీ మంత్రి గాలి ముద్దుమకృష్ణమనాయుడు మాత్రం.. అధినేత - కేంద్రమంత్రి అభిప్రాయాలకు పూర్తి విరుద్ధంగా మాట్లాడి పార్టీని ఇరికించడం చర్చనీయాంశమవుతోంది.

ప్యాకేజీకి వ్య‌తిరేకంగా ముద్దుకృష్ణ‌మ‌నాయుడు బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు.‘అప్పుడు హోదా కావాలని వెంకయ్య అడిగారు. జైట్లీ కూడా పదేళ్లు కావాలని హడావిడిగా బిల్లు ఆమోదించుకున్నారు. ఇప్పుడు హోదాతో ఏం లాభమని ప్యాకేజీ ఇస్తామంటూ కాకిలెక్కలు చెప్పడం కేంద్రానికి తగదు. హోదా ఇవ్వకుండా దానికి బదులుగా లక్షల కోట్ల నిధులిస్తామనడం హాస్యాస్పద’మని ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు. దీంతో గాలి వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయి.

హోదా-ప్యాకేజీ అంశాలపై ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చి మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విష‌యంలోనూ టీడీపీలో ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తోంది. ప‌వ‌న్ పై ఎవరూ విమర్శలు చేయవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే 24 గంటలు కూడా గడవకముందే, సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం ఆదేశాలు బేఖాతరు చేస్తూ చేసిన ప్రకటన, పార్టీలో కట్టుదాటుతున్న క్రమశిక్షణను సూచిస్తోంది. ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేస్తే మళ్లీ గెలిపించుకుంటామని పవన్ చేసిన ప్రకటనపై అయ్య‌న్న‌ తీవ్ర స్థాయిలోవిరుచుకుపడ్డారు. అనకాపల్లిలో సొంత బావ అల్లు అరవింద్‌నే చిరంజీవి - పవన్ గెలిపించుకోలేకపోయారని ఇక అవంతి శ్రీనివాస్‌ ను ఏం గెలిపిస్తారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామం పవన్‌ కు ఎక్కడ ఆగ్రహానికి గురిచేస్తుందోనన్న సంకటం తెదేపా నేతల్లో కనిపిస్తోంది.

పార్టీ అధినేత - ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా పట్టించుకోకుండా నేత‌లు ఇష్టారాజ్యంగా వ్యాఖ్య‌లు చేస్తుండ‌డంతో క్ర‌మ‌శిక్ష‌ణ క‌ట్టుత‌ప్పుతోంద‌ని అంటున్నారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే టీడీపీ మ‌రో కాంగ్రెస్ అవుతుందంటున్నారు.