Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ దీక్షలో కొత్త కోణం

By:  Tupaki Desk   |   10 Jun 2016 4:11 PM GMT
ముద్ర‌గ‌డ దీక్షలో కొత్త కోణం
X
కాపునాడు నాయ‌కుడు ముద్రగడ పద్మనాభం ఎపిసోడ్ మ‌లుపులు తిరుగుతోంది. ఆయ‌న అరెస్టు - ఈ క్ర‌మంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లు - సాక్షి చాన‌ల్ నిలిపివేయ‌డం వంటి ప‌రిణామాలు క‌ల‌క‌లానికి దారితీశాయి. ఏకంగా మంత్రులు త‌మ‌దైన శైలిలో స్పందించి ముద్ర‌గ‌డ తీరును - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ ముద్ర‌గ‌డ‌ - మందకృష్ణను అడ్డుపెట్టుకుని జగన్ కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తుని ఘ‌ట‌న‌లో దోషుల‌ను విడుద‌ల చేయాల‌ని కోర‌డం స‌రికాద‌ని శాంతిభద్రతలను కాపాడడంలో భాగంగా వారిని అరెస్టుచేశామ‌ని తెలిపారు. ముద్రగడ దీక్ష విరమించాలని కోరారు. పుర‌పాల‌క‌ మంత్రి నారాయణ మాట్లాడుతూ తుని ఘటనలో అమాయకులను అరెస్ట్‌ చేయలేదని చెప్పారు. తునిలో హద్దులు మీరి ప్రసంగాలు చేయడంతోనే విధ్వంసం జరిగిందని...అరెస్టయినవారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలు - రౌడీలేనని ఆయన అన్నారు.

ఇక మ‌రో మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సాక్షి టీవీ ఛానల్‌ ప్రసారాలను నిలిపివేశామని ప్ర‌క‌టించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆయన స్ప‌ష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం ఉనికి కోసమే దీక్షలు చేస్తున్నారని, ఆయన దీక్ష వెనక జగన్ ఉన్నారని మంత్రి ఆరోపించారు. ఇదిలాఉండ‌గా కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయ కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. కాపుల సమస్యల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతున్న‌ ముద్రగడ పద్మనాభం ఆ నిర్ణ‌యాధికారి అయిన సీఎం చంద్రబాబును ఎందుకు క‌ల‌వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. పైగా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను క‌లిసి వారి మ‌ద్ద‌తు కోరార‌ని దీన్ని బ‌ట్టే ముద్ర‌గ‌డ‌కు వైసీపీ నేత జగన్‌ హస్తం ఉందని తేలిపోతోంద‌ని చెప్పారు.

ఇదిలాఉండ‌గా ముద్రగడ అరెస్ట్‌ కు నిరసనగా కృష్ణాజిల్లా బంద్‌ కు ఆయ‌న మ‌ద్ద‌తు దారులు పిలుపునిచ్చారు. కాపు సామాజికవర్గాన్ని ప్రభుత్వం రెచ్చగొట్టడం స‌రికాద‌ని పేర్కొంటూ ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించాలని కాపునాడు నాయ‌కులు కోరారు. తుని ఘటన కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాపు ఉద్య‌మం అణిచివేత‌ - ముద్ర‌గ‌డ అరెస్టుకు నిర‌స‌న‌గా శనివారం కృష్ణా జిల్లా బంద్ చేప‌ట్టాల‌ని కాపునాడు పిలుపునిచ్చింది.