Begin typing your search above and press return to search.

నాటి కాంగ్రెస్‌ నేటి తెదేపా రెండూ ఒకటేనా?

By:  Tupaki Desk   |   6 Sep 2015 5:46 AM GMT
నాటి కాంగ్రెస్‌ నేటి తెదేపా రెండూ ఒకటేనా?
X
అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా ఒకే తీరుగా ప్రవర్తిస్తుంది. అయితే ప్రత్యేకించి కొన్ని మాటల విషయంలో పరస్పర విరుద్ధమైన రెండు పార్టీలు ఒకే రీతిగా వ్యవహరించడం.. అనేది చర్చించుకోవాల్సిన అంశమే. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అనుసరిస్తున్న ఒక వైఖరి.. అచ్చంగా ఇదివరలో కాంగ్రెస్‌ అనుసరించిన వైఖరి, విధానాల్ని గుర్తుకు తెస్తున్నది. ఒకప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ ఏ రీతిగా అయితే ప్రజల్ని మభ్యపెట్టి బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిందో.. ఇప్పుడు తెలుగుదేశం కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనేది దక్కడం అంత ఈజీకాదు. నిర్మొగమాటంగా చెప్పాలంటే అసాధ్యం అని దాదాపుగా చాలా మందికి అర్థమైపోయింది. కాకపోతే.. ప్రత్యేకహోదా కావాలనే ఆశ ప్రజలందరిలోనూ ఉన్నది. తపన ఉన్నది. దాని కోసం పోరాడాలనే కోరిక ఉన్నది. ఒకవైపు మడమ తిప్పకుండా సుదీర్ఘ కాలమైనా పోరాడడానికి విపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రంగం సిద్ధం చేసుకుంటుడగా.. ఇలాంటి పోరాటాలపై ప్రజలకు సానుకూలత ఏర్పడుతున్నది.
అయితే ప్రత్యేకించి.. రాష్ట్రానికి ఈ ప్రత్యేకహోదా విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఎలాంటి మాటలు చెబుతున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజల్లో బలీయంగా ఉన్న ఒక వాంఛకు సంబంధించి, ఇదిగో వచ్చేస్తుంది.. అదిగో వచ్చేస్తుంది.. అంతకంటె గొప్ప ప్యాకేజీ వస్తుంది.. అంటూ రకరకాల మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేకహోదా గురించి వల్లిస్తున్న మాటలను వింటోంటే.. అచ్చంగా సమైక్య పోరాటం సాగిన రోజుల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు వల్లించిన మాటలు, ఆడిన నాటకాలు గుర్తొస్తున్నాయి.

అప్పట్లో సీమాంధ్ర ప్రాంతం మొత్తం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంది. కేంద్రం మాత్రం తమ పార్టీ వారందరికీ.. విభజన తప్పదని తేల్చిచెప్పేసింది. తమకు కేంద్రం క్లారిటీ ఇచ్చేసినా రాష్ట్ర మంత్రులందరూ.. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది. విభజన జరగదు .. మాట్లాడుతున్నాం సోనియా ఒప్పుకుంటుంది.. అంతా బాగుపడుతుంది.. అనే మాయమాటలు చెబుతూ.. చిట్టచివరి రోజు వరకు ప్రజలను మభ్యపెట్టారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులందరూ కూడా ఆ పాపంలో భాగస్వాములే. ఇప్పుడు తెదేపా మంత్రులందరూ అదే పనిచేస్తున్నారు. వాతావరణం గమనిస్తోంటే అచ్చం అప్పటిలాగానే ఉంది. ప్రత్యేకహోదా అసాధ్యం అని కేంద్రం వారితో తెగేసి చెప్పేసింది. వీరు మాత్రం ప్రజల ఎదుట తమ పరువు కాపాడుకోవడానికి ఇదిగో తెస్తాం.. అదిగో తెస్తాం.. లేఖ రాస్తున్నాం.. తీర్మానం చేస్తున్నాం.. హోదా పెద్ద గొప్పేం కాదు.. ప్యాకేజీ ముఖ్యం అంటూ మాయమాటలు చెబుతున్నారు.
ఈ వైఖరిని గమనిస్తే అచ్చంగా అప్పట్లో కాంగ్రెస్‌ అనుసరించిన వంచనా మార్గంలోనే.. ఇప్పుడు తెలుగుదేశం కూడా పయనిస్తున్నదని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే.. అలాంటి మోసానికి కాంగ్రెస్‌కు విధించిన శిక్షనే.. తెలుగుదేశం నాయకులు గుర్తు తెచ్చుకుంటే గనుక.. వారి వైఖరి మారవచ్చు.