Begin typing your search above and press return to search.

వారికి కేసీఆర్.. కేటీఆర్ లు ఫోన్లు చేశారా?

By:  Tupaki Desk   |   12 July 2016 4:24 AM GMT
వారికి కేసీఆర్.. కేటీఆర్ లు ఫోన్లు చేశారా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో సినీనటులు పెద్ద ఎత్తున పాల్గొనటం.. ఎవరికి వారు స్వచ్చందంగా.. పర్యావరణం మీద ప్రేమతో చెట్లను నాటినట్లుగా కనిపించటం తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున సినీ నటులు చెట్ల నాటటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీదున్న భయమన్న మాటల్ని కొందరు.. అదేమీ లేదు కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకే ఇంతటి స్పందన అన్న మాట వినిపించింది.

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇంత పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొనటానికి కారణం ఏమిటన్న విషయాన్ని సీనియర్ నటి కవిత చెప్పేశారు. టీడీపీ మహిళా నేతగా సుపరిచితురాలైన ఆమె.. తాజాగా మాట్లాడుతూ ఏపీ సర్కారు తీరును తప్పు పడుతూ.. తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకునే క్రమంలో.. అసలు విషయాన్ని చెప్పేయటం గమనార్హం.

సినీ నటులు హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు కేటీఆర్.. తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ప్రత్యేకంగా కోరారని.. జీహెచ్ ఎంసీ అధికారులైతే పదేపదే ఫోన్లు చేసి మరీ పిలిచారన్న ఆమె.. ఏపీ సర్కారు చేపట్టిన నీరు – చెట్టు కార్యక్రమానికి అసలు ఆహ్వానించలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ధర్నా సమయంలో పలుసార్లు ఫోన్లు చేసే వారని.. అధికారంలోకి వచ్చాక పిలవటమే మానేశారంటూ కవిత ఆరోపించారు. బాబు సర్కారు మీదున్న ఆగ్రహం మాటేమో కానీ.. హరితహారంలో సినీతారలు మెరిసిపోవటం వెనుక అసలు విషయాన్ని తన మాటలతో కవిత చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.