Begin typing your search above and press return to search.

బాబు దూకుడు : నో కౌంటర్ అటాక్... మ్యాటరేంటి...?

By:  Tupaki Desk   |   18 Jun 2022 5:31 AM GMT
బాబు దూకుడు : నో కౌంటర్ అటాక్... మ్యాటరేంటి...?
X
ఏపీలో ఒక గొంతే వినిపిస్తోంది. ఒక రూపే కనిపిస్తోంది. ఆయనే టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన గత నెలన్నర రోజులుగా విసుగూ విరామం లేకుండా ఏపీని చుట్టేస్తున్నారు. ఒంగోలులో మహానాడు సూపర్ హిట్ కావడంతో టీడీపీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగాయి. దానికి ముందు బాదుడే బాదుడు కూడా బంపర్ హిట్ అయింది. ఇంకేముంది దున్నుడే దున్నుడు అనుకుని టీడీపీ తమ్ముళ్ళు వీధుల్లోకి వచ్చేశారు.

వార్ వన్ సైడ్ అని చంద్రబాబు అన్నారు. కానీ ఇపుడు ఏపీలో పాలిటిక్స్ మాత్రం వన్ సైడ్ అయిపోయింది. అధికారంలో ఉన్న పార్టీకి పాతిక మంది మంత్రులు ఉన్నారు. చేతిలో రెండేళ్ల అధికారం ఉంది. ఏ జిల్లాలో చూసినా మంత్రులు ఇంచార్జి మంత్రులు ఉన్నారు. కానీ బాబు బస్తీమే సవాల్ అని దూకుడు చేస్తూంటే సైలెంట్ గా వైసీపీలో సీన్ కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి అన్నదే చర్చగా ఉంది.

చంద్రబాబు ఉత్తరాంధ్రా టూర్ కూడా సక్సెస్ అయింది. ఆయన ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా అధికార పార్టీని ఉతికిపారేస్తున్నారు. ఏ మాత్రం స్పేర్ చేయకుండా జగన్ మీద బాణాలు వేస్తున్నారు. పాలన తెలియని వాళ్ళకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇలాగే ఉంటుంది అని బాబు పంచులే పేలుస్తున్నారు. కారు డ్రైవింగ్ రాని డ్రైవర్ ని పెట్టుకుంటే రివర్స్ లోనే తోలుతాడు అని కూడా జగన్ మీద బాబు విసుర్లు విసిరారు. ఇక మరో వైపు చూస్తే ఏపీలో జగన్ సీఎం గా ఉంటే ఉద్యోగాలు అసలు రావు అని కూడా బాబు అంటున్న మాటలు యువతలో పెద్ద ఎత్తున చర్చను లేపుతున్నాయి.

మూడేళ్ళలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అంటూ ఆయన నిలదీస్తున్న వైనం కూడా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే చంద్రబాబు వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూంటే కౌంటర్ ఇచ్చే సీన్ కూడా అధికార పార్టీలో పెద్దగా లేకపోవడం విశేషం. ఆఖరుకు మూడు రోజుల బాబు ఉత్తరాంధ్రా టూర్ తరువాత అంబటి రాంబాబు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. బాబు చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఆయన అపరిచితుడు. కొత్త బాబును చూస్తున్నామని అంబటి తనదైన శైలిలో దీర్ఘాలు తీశారు. బాబులో ఫస్ట్రేషన్ ఉంది ఆవేశం పాలు కూడా హెచ్చుగా ఉంది అంటూ అంబటి మెత్తమెత్తగా అనేసి ముగించేశారు.

ఏపీలో రాజకీయం మారుతోంది. గాలి అటు నుంచి ఇటు వీస్తోంది. ఇక చంద్రబాబు అధికార పార్టీ మీద చండ్రనిప్పులే కురిపిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ కాడె వదిలేసిన చందంగా సీనియర్లు అంతా సైడ్ అయ్యారని అంటున్నారు. పేరుకు పాతిక మంది మంత్రులు ఉన్నా ఏ ఒక్కరూ పెద్దగా నోరు విప్పకపోవడం వల్ల వైసీపీ బాబుతో సరికొత్త రాజకీయ యుద్ధంలో దాదాపుగా చేతులెత్తేసినట్లే అంటున్నారు.

ఇంకా ఇది ఆరంభమని, బాబు మరిన్ని జిల్లాలు తిరుగుతారని, ఏడాది పాటు బాబు జనంలో ఉంటూ చేసే విమర్శలను తట్టుకోవడం కష్టమే వాటికి కౌంటర్లు ఇవ్వడమూ కష్టమే అని చెబుతున్నారు. కానీ ఎందుకో వైసీపీ లైట్ తీసుకుటోందా లేక ఇక చాల్లే అని చల్లబడిపోయిందా అన్నదే అర్ధం కావడం లేదని అంటున్నారు. ఒక్క మాట చెప్పుకోవాలీ అంటే బాదుడే బాదుడుతో జోరు పెంచి ఒంగోలు మహానాడుతో టీడీపీ గేరు మార్చేసింది. ఇక ఈ దూకుడు ఇలాగే కొనసాగితే మాత్రం అధికార పార్టీకి ఎదురుగాలే అని అంటున్నారు