Begin typing your search above and press return to search.

బడ్జెట్‌ సమావేశలపై టీడీపీ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   15 Jun 2020 2:36 PM GMT
బడ్జెట్‌ సమావేశలపై టీడీపీ కీలక నిర్ణయం !
X
ఆంధ్రప్రదేశ్ లో ఈ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు గతానికి భిన్నంగా జరగనున్నాయి. మంగళవారం (ఈ నెల 16) రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఉభయ సభల సమావేశాలను కేవలం రెండు రోజులకే కుదించబోతున్నట్ల తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశలపై చర్చించడానికి చంద్రబాబు నేత‌ృత్వంలో ఈ రోజు సమావేశమైన టీడీఎల్పీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ వైరస్ విజృంభణ నేపథ్యంలో రెండు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని విమర్శలు కురిపిస్తున్న టీడీపీ, ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ, టీడీఎల్పీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో అక్రమ అరెస్టులు, ఇసుక మాఫియా, మద్యం ధరలు, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. తమ పార్టీ నేతల అరెస్టులపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు టీడీపీ నేతలు.

మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, అదేరోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని సమాచారం. అదే రోజు బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపి.. మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభ సమావేశాలను వాయిదా వేయాలని ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే రెండ్రోజుల సభలో పలు కీలకాంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష టీడీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సభలో కార్యకలాపాలు అధికార పక్షం అనుకున్నంత వేగంగా, సభ ముందుకు సాగుతుందా లేదా అనేది చూడాలి. అయితే , ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుంటే .. విపక్ష టీడీపీ వ్యూహాన్ని సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు అధికార వైసీపీ కూడా స్పష్టమైన వ్యూహంతో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్టు రాజకీయ వర్గాల సమాచారం.